కరోనా సోకిందని తెలియగానే చుట్టుపక్కల వారు భయపడిపోతుంటారు. చివరకు ఇంటిపక్క వారు కూడా తలుపు తీయరు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు లెక్క చేయకుండా వైరస్ సంచరిస్తున్న ప్రాంతం లేదా ఇండ్ల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు బల్దియాకు చెందిన ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది. ప్రత్యేక వాహనాలు, వేగంగా వెదజల్లే పరికరాల సాయంతో రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో స్ప్రే చేస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా, 202 బృందాలుగా సిబ్బంది విడిపోయి రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. కరోనా రెండోదశ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 16,129 ప్రాంతాల్లో 2,74,027 నివాసాల వద్ద స్ప్రే చేశారు. 18,354 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని వినియోగించారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్ ఆదేశాల మేరకు గ్రేటర్ను వైరస్ రహిత నగరంగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంటమాలజీ చీఫ్ రాంబాబు వెల్లడించారు.
‘దేశం నీకేం చేసిందని కాదు.. దేశం కోసం నువ్వేం చేశావ్ ? ఇదే నిజమైన దేశభక్తుడు అడిగే తొలి ప్రశ్న. ఎస్.. ఇప్పుడు దానికి సరైన సమాధానం చెబుతున్నారు… బల్దియా ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బంది. పక్కింట్లో కాదు.. ఇంట్లోనే ఒకరికి కరోనా వచ్చిందంటేనే తమకు ఏమవుతుందోనని దూరం పెట్టే రోజులువి. కానీ.. కొవిడ్ పేషెంట్లు ఉన్నారన్నా… ఏమాత్రం అజాగ్రత్త వహించినా మహమ్మారి తమను ఆవహిస్తుందని తెలిసినా సరే.. విధుల్లో వెనుకాడని తీరు. కరోనా పంజా విసిరిన ఇండ్లల్లోకీ నిర్భయంగా ప్రవేశించే ధైర్యం ఎవరికి ఉంటుందంటే.. అది కేవలం కరోనా వారియర్స్కే అని గుండెమీద చేయివేసి మరీ చెప్పొచ్చు.
ఎలాగైనా సరే కరోనాను కట్టడి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న జీహెచ్ఎంసీ సిబ్బంది.. కరోనా కట్టడికి ఎనలేని కృషి చేస్తున్నారు. గ్రేటర్ను వైరస్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇల్లూవాకిలీ.. దుకాణాలువీధులు.. ఇలా తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ నిత్యం శానిటైజ్ చేస్తూ వైరస్ నియంత్రణకు యోధుల్లా పనిచేస్తున్నారు. అలాంటి కరోనా వారియర్స్కు సెల్యూట్ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉంది.
సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ ) : కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ ఎంటమాలజీ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది చేస్తున్న కృషి ఎనలేనిది. మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించడమే లక్ష్యంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు వారు. 202 బృందాలుగా ఏర్పడి కొవిడ్ పాజిటివ్ ఏరియాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మార్కెట్స్, ఏటీఎం సెంటర్లు, జన సాంద్రత గల ప్రాంతాలు, కొవిడ్ టెస్ట్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, బస్టాండ్లు, ప్రార్థనా మందిరాలు, మసీదులు, చర్చీలు, మురికివాడలు, గతేడాది హాట్స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
గ్రేటర్ను వైరస్ ఫ్రీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం నుంచి 16,129 ప్రాంతాలలో 2,74,027 ఇండ్లలో స్ప్రే చేశారు. 18,354 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని పిచికారీ చేశారు. నిత్యం డీఆర్ఎఫ్ విభాగానికి చెందిన ప్రత్యేక వాహనాలతో అన్ని ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న 30 సర్కిళ్లకు ప్రత్యేకంగా 840 న్యాప్సాక్ స్ప్రేయర్లతో పాటుగా సెంట్రలైజ్డ్గా మరో 15 వాహనాలను వినియోగిస్తున్నారు. నిత్యం రద్ధీగా ఉండే అన్ని రోడ్లకు ఇరువైపులా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు.
ప్రతి వాహనానికి ఒక డ్రైవర్ , ఇద్దరు వర్కర్లు, ఒక సూపర్ వైజర్ను పనిచేస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ..రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకూ రెండు షిప్టుల్లో సిబ్బంది స్ప్రేయింగ్ చేపడుతున్నారు. డీఆర్ఎఫ్ బృందాలు, కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా రావడం, స్థానిక ప్రజలు కాల్ చేస్తే అక్కడికి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు అని తేడా లేకుండా పనులు చేస్తున్నాం. ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మంత్రి కేటీఆర్, కమిషనర్ లోకేశ్కుమార్ ఆదేశాల మేరకు గ్రేటర్ను వైరస్ ఫ్రీ సిటీగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలి. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. కరోనా వైరస్ గురించి ప్రజలు భయాందోళన చెందవద్దు. – రాంబాబు, ఎంటమాలజీ చీఫ్, జీహెచ్ఎంసీ