వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో క్రీజులో అడ్డుగోడలా నిలిచిన ఆపద్బాంధవుడు. వికెట్ల వెనుక అనుభవం అవసరమైనప్పుడు చేతులకు గ్లౌజ్లు తొడుక్కున్న త్యాగశీలి. యువ ఆటగాళ్లకు తర్ఫీదు నిచ్చేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన ఘనుడు.. ఇప్పుడిక టీమ్ఇండియాకు కోచ్ అవతారమెత్తనున్నాడు. స్టార్లతో నిండిన భారత జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించేందుకు నిరాకరించిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్.. శ్రీలంకలో పర్యటించనున్న భారత రెండో జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించనున్నాడు.
న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్ భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో పాల్గొనేందుకు కోహ్లీసేన ఇంగ్లండ్లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత జట్టు లంకలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. దీంతో హెడ్ కోచ్ రవిశాస్త్రి సహా కోచింగ్ స్టాఫ్ ఇంగ్లండ్ టూర్లో ఉన్న సమయంలో.. లంకతో వన్డే, టీ20 సిరీస్లకు ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి గురువారం మాట్లాడుతూ.. ‘అతడు (ద్రవిడ్) జట్టుతో పాటు లంకకు వెళ్లనున్నాడు. ఇందుకు ద్రవిడ్ అంగీకారం తెలిపాడు’ అని చెప్పారు. బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే అతడితో పాటు లంక పర్యటనకు వెళ్లనున్నాడు.
ఖరారు కాకున్నా..
లంక పర్యటనపై ఇప్పటి వరకు బోర్డు నుంచి అధికారిక ప్రకటన రాకున్నా జూలైలో టీమ్ఇండియా అక్కడికి వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. ఈ టూర్లో టీమ్ఇండియా మూడు వన్డేలతో పాటు మూడు టీ20లు ఆడనుంది. కోహ్లీ, రోహిత్ సహా ప్రధాన ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నప్పటికీ.. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్లతో భారత్ మరో జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్, పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాల్లో ఒకరు సారథ్యం వహించే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో అర్ధాంతరంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్లో భుజం గాయానికి గురైన శ్రేయస్ అయ్యర్ కోలుకుంటే అతడు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
విండీస్ ప్లేయర్లకు వ్యాక్సిన్
సెయింట్జాన్స్ (అంటిగ్వా): తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ను క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రారంభించింది. ముందుగా టెస్టు జట్టులోని 11 మంది ఆటగాళ్లతో పాటు ఇద్దరు సహాయక సిబ్బందికి గురువారం వ్యాక్సిన్ తొలి డోసు వేయించింది. కాగా తదుపరి స్వదేశంలో వెస్టిండీస్ దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, ఐదు టీ20ల సిరీస్లు ఆడనుంది. జూన్ 10న టెస్టు పోరు ప్రారంభం కానుంది. మరోవైపు ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 19 వరకు జరుగుతుందని నిర్వాహకులు షెడ్యూల్ ప్రకటించారు.
అప్పట్లోనే చాన్స్ వచ్చినా..
2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత అప్పటి హెడ్ కోచ్ కుంబ్లే ఆ పదవిని వదులుకున్న సమయంలోనే కోచ్గా ద్రవిడ్ పేరు ప్రధానంగా వినిపించింది. అయితే స్టార్ కల్చర్ ఉన్న టీమ్ఇండియాకు తాను శిక్షకుడిగా పనిచేయలేనని భావించిన ద్రవిడ్ అండర్-19తో పాటు భారత-ఎ జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికితీయడంలో ప్రధాన పాత్ర పోషించిన రాహుల్.. మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేశాడు. ఐపీఎల్లో దుమ్మురేపుతున్న చాలామంది ద్రవిడ్ శిక్షణలో రాటుదేలిన వాళ్లే కావడం విశేషం.