రూపాలు మార్చుకుంటున్న కరోనా రక్కసిని చూసి యావత్ ప్రపంచం భయాందోళనకు గురవుతున్నది. భారత్లో తొలిసారిగా బయటపడి.. దేశంలో సెకండ్వేవ్ కల్లోలానికి కారణమైన కొత్తరకం డబుల్ మ్యుటెంట్ వైరస్ ‘బీ.1.617’ను చూసి యావత్ ప్రపంచం కలవరపడుతున్నది. ఈ వేరియంట్ ఇప్పటికే 44 దేశాలకు వ్యాపించింది. పిల్లలపై అధికప్రభావం చూపుతున్న కారణంగా స్కూళ్లను మూసేస్తున్నారు. అయితే, ఈ మొండి వేరియంట్ను కూడా టీకాలు సమర్థంగా అడ్డుకోవటం ఉపశమనం కలిగిస్తున్నది.
రోగుల శరీరంలో తిష్ట వేసేందుకు, రోగనిరోధకవ్యవస్థ తాలూకు యాంటీబాడీలకు దొరకకుండా ఉండేందుకు కరోనా వైరస్ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పరివర్తనాలకు (మ్యుటేషన్లకు) లోనవుతుంటుంది. ఈ క్రమంలోనే భారత్లో తొలిసారిగా కరోనాకు సంబంధించిన ఓ కొత్త వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ‘బీ.1.617’ అని పేరు పెట్టారు. బ్రిటన్లో సెకండ్ వేవ్కు కారణమైన బీ.1.1.7 వేరియంట్ తో పోలిస్తే, ‘బీ.1.617’ వేరియెంట్ 50 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు వెల్లడించారు.
బీ.1.617 వేరియంట్ మూడు రకాలుగా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని బీ.1.617.1, బీ.1.617.2, బీ.1.617.3గా విభజించారు. ఇందులో ‘బీ.1.617.2’ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (ఆందోళన కలిగించే రకం)గా బ్రిటన్ గుర్తించింది. ఇది అత్యంత ప్రమాదకరమైనదని వెల్లడించింది. బీ.1.617 అన్నిరకాలను వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా కెనడా గుర్తించింది. ‘బీ.1.617’ వేరియంట్ ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొంటూ మే 10న డబ్ల్యూహెచ్వో దీన్ని ‘గ్లోబల్ కన్సర్న్’గా, ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది.
‘బీ.1.617’ వేరియంట్ను ఇప్పటివరకూ 44 దేశాల్లో గుర్తించినట్టు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ముఖ్యంగా ‘బీ.1.617.2’ను భారత్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, జర్మనీ, ఇండోనేషియా, జపాన్, నేపాల్, సింగపూర్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, థాయిలాండ్, అంగోలా, జోర్డాన్, ఉగాండా తదితర దేశాల్లో గుర్తించినట్టు వివరించింది.
గత ఉత్పరివర్తనాలతో పోల్చి చూస్తే ‘బీ.1.617’ వేరియంట్ పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. పిల్లల్లో ఇటీవల కరోనా కేసుల పెరుగుదల దీనికి ఊతం ఇస్తున్నది. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తూ సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బుధవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అలాగే, దేశంలో 16 ఏండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు టీకాలు వేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. తైవాన్ కూడా స్కూళ్లను మూసేసింది.
‘బీ.1.617’ వేరియంట్ పై తమ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్టు ఇప్పటికే పలు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ప్రకటించాయి. అయితే, వ్యాక్సిన్ ఇచ్చే రక్షణ కవచాన్ని కూడా దాటుకొని ‘బీ.1.617.2’ వేరియంట్ దాడి చేసే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఇటీవల వెల్లడించారు. అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. భారత్లోని మొత్తం జనాభాలో కేవలం 3 శాతం మందికే టీకా వేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతున్నదని, 130 పేద, వర్ధమాన దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్ ప్రారంభమే కాలేదని ఇన్ఫ్ల్యుయెన్షియల్ వెల్కమ్ ట్రస్ట్ డైరెక్టర్ జెరెమీ ఫారర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత వ్యాక్సిన్లు బీ.1.617తో పాటు అన్ని వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తాయన్న నమ్మకం పెరుగుతున్నదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం పార్లమెంటులో వెల్లడించారు. తాజా శాస్త్రీయ సమాచారం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నదన్నారు. మరోవైపు, బీ.1.617 వ్యాప్తి వేగం ఊహించినదానికన్నా తక్కువగానే ఉందని బ్రిటన్కు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్టు నీల్ ఫర్గ్యూసన్ చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వైరస్ వ్యాప్తిపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపకపోవచ్చని ఆయన అభిప్రాయపడటం గమనార్హం. ఇదిలాఉండగా.. అమెరికాలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు బీ.1.617 వేరియెంట్పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఆ దేశ వైద్యాధికారులు ప్రకటించారు.