న్యూఢిల్లీ, మే 19: డీఏపీ ఎరువుల మీద రాయితీని కేంద్రప్రభుత్వం 140% పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.500 రాయితీని రూ.1200 చేసింది. అంటే కొత్తగా రూ.700 రాయితీని పెంచింది. దీంతో కేంద్రంపై అదనంగా రూ.14,775 కోట్ల భారం పడనుంది. రాయితీ పెరిగినప్పటికీ ప్రస్తుత ధరల్లో మార్పు ఉండదు. ఇప్పుడు మార్కెట్లో డీఏపీకి ఉన్న ధరలే ఇకముందు కూడా ఉంటాయి. అంతర్జాతీయంగా డీఏపీ ధరలు పెరగడంతో ఇండియాలో కూడా పెరిగాయి. ఆ పెరిగిన భారం రైతులపై పడకుండా ఉండేందకు కేంద్రం రాయితీని పెంచింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ‘డీఏపీ ఎరువుల బస్తాపైన రాయితీని రూ.500 నుంచి రూ.1200కు పెంచాలని నిర్ణయించారు. దీంతో డీఏపీ ప్రస్తుత మార్కెట్ ధర రూ.1200కే ఇక ముందు కూడా లభిస్తుంది’ అని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.