న్యూఢిల్లీ : కరోనా వైరస్ సింగపూర్ వేరియంట్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో భారత ప్రభుత్వం స్పందించింది. భారత్ తరపున కేజ్రీవాల్ మాట్లాడలేరని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం స్పష్టం చేశారు. కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్-సింగపూర్ లు ద్వైపాక్షిక భాగస్వామ్యంతో ముందుకెళ్లాయని ఆయన ట్వీట్ చేశారు. ఆక్సిజన్ సరఫరాలతో పాటు లాజిస్టిక్స్ హబ్ గా సింగపూర్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు.
భారత్ కు సాయపడేందుకు సైనిక విమానాలను సిద్థం చేయడం ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి విస్పష్ట సంకేతమని అన్నారు. బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు దీర్ఘకాల భాగస్వామ్యాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ స్ట్రెయిన్ ల ముద్ర వేస్తూ మాట్లాడే సాధికారత ఢిల్లీ సీఎంకు లేదని సింగపూర్ కు భారత్ స్పష్టం చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. సింగపూర్ వేరియంట్ పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై సింగపూర్ ప్రభుత్వం భారత రాయబారి ఎదుట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగపూర్ స్ట్రెయిన్ లేదని స్పష్టం చేసింది.