అలంపూర్, మే 14 : ఇతర రాష్ర్టా ల నుంచి వచ్చే వారు నిబంధనల మే రకు తెలంగాణలో అడుగుపెట్టాలని ఎస్సై మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తుంగభద్ర నది వంతెనపై ఆంధ్రప్రదేశ్ నుంచి అలంపూరు వైపు వచ్చే వారికి అవగాహన కల్పించారు. అత్యవసర పనులు, ఆరోగ్య సమస్యలున్న వారు ప్రభుత్వ అనుమతులతో రావొచ్చన్నారు. ఉదయం 10 గంటల తర్వాత వచ్చే ప్రతి వాహనాన్ని, వ్యక్తులను క్షుణ్ణంగా విచారించి అనుమతుల మేరకు పంపుతున్నారు. నది వంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
సరిహద్దులు మూసివేత
కేటీదొడ్డి, మే 14 : కర్ణాటకలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున అక్కడి వారు తెలంగాణలోకి రాకుండా సరిహద్దులు మూసివేస్తున్నట్లు పాగుంట సర్పంచ్ సుభాషిణి తెలిపారు. సరిహద్దు గ్రామాల ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా ముళ్లకంపలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో కరోనా కట్టడికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాగుంట ప్రజలు ఇండ్లు వదిలి ఎక్కడికీ వెళ్లొద్దని సూచించారు. ఉదయం 10 గంటలలోపు తమ పనులు ముగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సవారన్న తదితరులు పాల్గొన్నారు.
అనుమతులు తప్పనిసరి..
అమ్రాబాద్, మే 14 : సరిహద్దులు దాటేటప్పుడు అనుమతులు తప్పనిసరి అని నాగర్కర్నూల్ కలెక్టర్ ఎల్.శర్మన్ సూచించారు. శుక్రవారం అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఏర్పాటుచేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చెక్పోస్ట్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ నుంచి వచ్చే వాహనాలను అనుమతులు పరిశీలించాకే తెలంగాణలోకి పంపాలని తెలిపారు. అంతకముందు ఎస్పీ సాయిశేఖర్ చెక్పోస్ట్ వద్ద పరిస్థితులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సై పోచయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.