నల్లగొండ/మునుగోడు/కనగల్, మే 11: ఇటీవల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండగా జనం ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షంతో కాస్త ఊరట కలిగినట్టయింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం ఆరబోసినప్పటికీ పెద్దగా నష్టం జరిగిన పరిస్థితులు కనిపించలేదు. మధ్యాహ్నం తర్వాత వర్షం ప్రారంభమైనప్పటికీ అంతకు ముందే సాధారణంగా గాలి దుమారం షురూ అయ్యి వాతావరణం చల్లబడింది. దీంతో అప్రమత్తమైన రైతులు వెంటనే కేంద్రాలకు వెళ్లి ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పి భద్రపర్చారు.
వర్ష ప్రభావం పాక్షికమే..
జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి సాధారణంగా ఎండ ప్రభావం ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. ఒక్కసారిగా చల్లబడి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం పడింది. ప్రధానంగా నల్లగొండతోపాటు కనగల్, తిప్పర్తి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలికి భారీ వృక్షాలు నేలమట్టం కాగా మామిడి పంటకు నష్టం వాటిల్లింది. కనగల్ మండలం దోరెపల్లికి చెందిన పెరుమాళ్ల లక్ష్మీనారయణకు చెందిన ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరి చెట్టుపై పడ్డాయి. ఇక మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో చిరుజల్లులు పడగా నకిరేకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మోస్తరు వాన పడింది. ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం గంటపాటు జల్లులు కురిశాయి. మునుగోడు మండలం జక్కలివారిగూడెంలో పిడుగు పడటంతో కంబాలపల్లి కృష్ణయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. దాని విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.
పంట ఉత్పత్తులు పదిలం…
జిల్లాలో ప్రస్తుతం 376 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తుండగా ఆయా కేంద్రాల్లో సగానికి పైగా ధాన్యం ఉంది. అయితే చిరుజల్లులు కావడం, అంతకుముందే వాతావరణంలో మార్పులతో రైతులు అప్రమత్తమై ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పడంతో పంట ఉత్పత్తులు పదిలంగా ఉన్నాయి. అదేవిధంగా గాలి దుమారం కూడా పెద్దగా రాకపోవటంతో మామిడి, బత్తాయి, నిమ్మతోటలపై ప్రభావం పడలేదని ఉద్యానశాఖ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల్లో నింపగా అవి మాత్రం కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా తడిశాయి. ఇదిలా ఉండగా సాయంత్రం నుంచి రాత్రి సమయంలోనూ కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట : జిల్లాలో మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షంతో ఒక్కసారిగా వాతవరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం జిల్లా కేంద్రంలో గాలి దుమారంతోపాటు మోస్తరు వర్షం కురువగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లో మోస్తరు నుంచి చిరుజల్లులు కురిశాయి. కోదాడ, హుజూర్నగర్ నియోజక వర్గాల్లో గాలి దుమారంతోపాటు చిరు జల్లులు పడ్డాయి. వర్షంతో పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. రైతులు ముందస్తుగా టార్పాలిన్లు కప్పడంతో పెద్దగా నష్టం జరుగలేదు.