రోజు 5 వేలకు తగ్గకుండా టెస్ట్లు చేయండి
సీఎం కేసీఆర్తో మాట్లాడి సరిపడా కిట్లు తెప్పిస్తా
ఆక్సీజన్, రెమ్డెసివీర్ ఇంజక్షన్లకు కొరత లేదు
సత్తుపల్లి, మధిర దవాఖానల్లోనూ కొవిడ్ సేవలు
ఈ నెలాఖరు నాటికి రెండో డోస్ టీకా పూర్తవ్వాలి
వారం రోజుల్లోగా వైద్యుల నియామకం
కొవిడ్ నియంత్రణ చర్యల సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం సిటీ/ కొత్తగూడెం మే 10:“కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగమంతా కలిసి ప్రజలకు అండగా నిలబడాలి.” అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. కొవిడ్ నుంచి కోలుకున్న మంత్రి సోమవారం ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, ఖమ్మం సీపీ, వైద్యారోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్, పంచాయతీరాజ్, ఇతర ఉన్నతాధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సోకిందనే భయంతో ధైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు మానసిక ైస్థెర్యం నింపాలని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు ప్రాణవాయువును అందించేందుకు ప్రతి ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. భద్రాద్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొవిడ్ చికిత్సలు, ఆక్సీజన్, ఇంటింటి సర్వేపై సోమవారం వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు, మండల స్థాయిలోనే వ్యాధిని నియంత్రణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేకు చేపట్టిందన్నారు. లక్షణాలున్న వ్యక్తులకు హోం మెడికల్ కిట్లు పంపిణీ చేస్తూ ఆరోగ్యాన్ని పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. కరనాను ఎదుర్కొంటూనే జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నారంటూ కలెక్టర్ను, వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమం దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.
అశ్వారావుపేట, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ఆస్పత్రులను కొవిడ్ చికిత్స కేంద్రాలుగా ఏర్పాటు చేసి ముందస్తుగా ఆక్సీజన్ నిల్వలు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఐటీసీ నుంచి ప్రాణవాయువు సరఫరా చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తుల కేస్ షీట్ ఆధారంగా విచారణ నిర్వహించి సమగ్ర నివేదికలు అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో 80 శాతం మేర ఇంటింటి సర్వే నిర్వహణ ప్రక్రియను పూర్తి చేశామని, వైరస్ నియంత్రణకు సర్వే ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుందని ఉంటుందన్నారు. భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ తీవ్రత తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్, వైద్యాధికారులు శిరీష, ముక్కంటేశ్వరరావు, జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో మధుసూదన్రాజు, డీపీవో రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.