ఇంటింటికీ వెళ్లి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
జిల్లా వ్యాప్తంగా 1,96,225 ఇండ్లల్లో పూర్తయిన సర్వే
5,718 జ్వర పీడితుల గుర్తింపు..హెల్త్ కిట్ల అందజేత
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు రోజులుగా చేపట్టిన ఇంటింటి జ్వర పీడితుల గుర్తింపు సర్వే తుది దశకు చేరుకున్నది. జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 757 బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆదివారం నాటికి జిల్లాలో మొత్తం 2,10,329 ఇండ్లలో జ్వర సర్వే పూర్తిచేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో జ్వరంతో బాధపడుతున్న 3,162 మందిని, మున్సిపాలిటీల పరిధిలో 1,019 మందిని గుర్తించి హెల్త్కిట్లు అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో ప్రారంభించిన ఓపీ సేవల సందర్భంగా జ్వరంతో బాధపడుతున్న 1,537 మందిని గుర్తించి వారికి కూడా హెల్త్ కిట్లను అందజేశారు. కనీసం వారం రోజుల పాటు మందులు వాడాలని, జ్వరం లేదా దగ్గు, ఆయాసం తగ్గనట్లయితే మెరుగైన వైద్యం కోసం తమకు సమాచారం ఇస్తే ఐసొలేషన్ వార్డులకు తరలించి తక్షణ చికిత్సను ప్రారంభిస్తామని వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
-యాదాద్రి భువనగిరి, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
చౌటుప్పల్ రూరల్, మే 9 : కరోనా కట్టడికి ప్రభుత్వం జ్వర సర్వే నిర్వహిస్తుందని సర్పంచ్ చిన్నం లావణ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామంలో ఇంటింటికి తిరిగి జ్వర సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మోటకొండూర్లో…
మోటకొండూర్, మే 9 : మండలంలోని ఆయా గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు ఇంటింటికి జ్వర సర్వేను ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి నమోదు చేసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి పలు ఆరోగ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్లో…
యాదగిరిగుట్ట రూరల్, మే 9 : జ్వరం, జలుబు తదితర కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే ఆదివారం యాదగిరిగుట్ట మండలంలో నాలుగవ రోజు కొనసాగింది. ఆశవర్కర్లు, అంగన్వాడీ, వైద్య, పంచాయతీ సిబ్బంది మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జ్వరం తదితర లక్షణాలు ఉన్న వారికి అక్కడే ప్రభుత్వం నుంచి ఇచ్చిన కొవిడ్ కిట్లను అందించారు. సర్వేను యాదగిరిగుట్ట ఎంపీడీవో కారం ప్రభాకర్రెడ్డి, ఎంపీవో చంద్రశేఖర్ పర్యవేక్షించారు.
ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం), మే 9:ఆరోగ్య సమస్యలతోపాటు కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే ఆదివారం మండల కేంద్రంతోపాటు అన్ని గ్రా మాల్లో ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు చేపట్టారు. 4రోజులపాటు మండలంలోని అన్ని గ్రా మాల్లో ఇంటింటికి చేపట్టిన జ్వర సర్వేలో 7,270 మందిని సర్వే చేయగా, 300 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు.
వలిగొండలో…
వలిగొండ, మే 9 : మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నాలుగవ రోజు ఇంటింటి జ్వర సర్వేను అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్వహించారు. సర్వేలో భాగంగా గ్రామాల్లోని ప్రతి ఇంటింటికి వెళ్లి కుటుంబ ఆరోగ్య సమాచారం సేకరించారు. ఆదివారం మండల వ్యాప్తంగా 1,893 ఇండ్లను సర్వే చేసి 51 మందిలో అనారోగ్య లక్షణాలను గుర్తించిన ఆరోగ్య సిబ్బంది, 31 మందికి మెడికల్ కిట్లను అందజేశారు.