మహబూబ్నగర్టౌన్, మే 8: మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఇంటింటి సర్వే కొనసాగుతున్నది. శనివారం వార్డు ప్రత్యేక అధికారులు సర్వేను పర్వవేక్షించారు. మూడో రోజు వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే ఇంటివద్దే మందులు ఇస్తారని తెలిపారు.
జడ్చర్లలో..
జడ్చర్లటౌన్, మే 8: జడ్చర్ల అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే కొనసాగుతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో వైద్య, మున్సిపల్ సిబ్బందితోపాటు వార్డు కౌన్సిలర్ కాటమోని శంకర్(దేవా) ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. స్వల్ప జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారి వివరాలను నమోదు చేసి మందులను పంపిణీ చేశారు. అన్ని వార్డుల్లో ఏఎన్ఎంలు ఇంటింటికెళ్లి వివరాలను నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10వేల ఇండ్లకుపైగా సర్వే చేసినట్లు అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు.
బాలానగర్లో..
బాలానగర్, మే 8: మండలంలోని పెద్దరేవల్లిలో శనివారం అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. వైద్యుల సలహాల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సునీత, కృష్ణవేణి, పారిజాత, తదితరులున్నారు.
మిడ్జిల్లో..
మిడ్జిల్,మే 8: గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వంశీప్రియ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఆశ, అంగన్వాడీ, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు ఒక బృందంగా ఏర్పడి ఇంటింటికీ తిరుగుతూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
నవాబ్పేటలో..
నవాబ్పేట, మే 8: మండలంలోని వివిధ గ్రామాల్లో గడిచిన నాలుగు రోజుల్లో 12వేల 302ఇండ్లలో జ్వర సర్వే నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా.నవీన్కుమార్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే 437మందికి జ్వరం ఉన్నట్లు నిర్ధారించి, 160మందికి కరోనా కిట్లు అందజేసినట్లు తెలిపారు. అనారోగ్య లక్షణాలు ఉన్నవారికి మాత్రమే కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో రాములు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
హన్వాడలో..
హన్వాడ, మే 8: ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది ఆరోగ్యంపై సర్వే చేపట్టారు. శనివారం మండలంలోని ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలు నమోదు చేసుకుని, పరీక్షలు చేశారు. ఇప్పటివరకు మండలంలో 10వేలకుపైగా ఇండ్లలకు వెళ్లి సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు.
భూత్పూర్లో..
భూత్పూర్, మే 8: మండల వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే చేస్తున్నట్లు ప్రాథమిక వైద్యాధికారి సంధ్యాకిరణ్మయి తెలిపారు. శనివారం మున్సిపాలిటీతోపాటు మండల వ్యాప్తంగా సర్వేను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షలు చేసే లోపల చికిత్స ద్వారా మందులను వాడితే రోగమే నయమయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమం లో సూపర్వైజర్ యాదమ్మ, ఏఎన్ఎంలతోపాటు అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొంటున్నారు.