న్యూఢిల్లీ: కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ఐపీఎల్ బయోబబుల్స్లోకి కరోనా వైరస్ ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. టోర్నీలో పాల్గొన్న ఎవరూ బబుల్ నిబంధనలను ఉల్లంఘించలేదని, అయితే ఈ విషయంపై మరింత విచారణ చేపడతామని స్పష్టం చేశాడు. ఢిల్లీ, అహ్మదాబాద్ బయో బబుల్స్లోని నలుగురు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డాక ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రయాణాలు, బబుల్స్లో లోపాలు, ఆరోగ్య పరీక్షల కోసం ఆటగాళ్లు బయటికి వెళ్లడం వల్లే ఇలా జరిగిందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై గురువారం గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘బయోబబుల్ ఉల్లంఘన జరుగలేదనే నివేదిక మాకు అందింది. ఇదెలా (వైరస్ ప్రవేశించడం) జరిగిందో కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతాం’ అని దాదా వెల్లడించాడు. అయితే ప్రయాణాలే ఈ సారి సమస్యగా మారాయన్నట్టు గంగూలీ మాట్లాడాడు. ‘గతేడాది ఐపీఎల్ యూఏఈలోని మూడు వేదికల్లో పరిమిత ప్రాంతంలో నిర్వహించాం. అక్కడ విమాన ప్రయాణాలు జరుగలేదు. ఈసారి ఆరు వేదికలు ఉన్నాయి’ అని సౌరవ్ చెప్పాడు.
ఐపీఎల్కు ఆతిథ్యమిస్తాం
ఇంగ్లిష్ కౌంటీ క్లబ్ల ఆఫర్
ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన 31 మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చేందుకు నాలుగు ఇంగ్లిష్ కౌంటీ క్లబ్లు ముందుకొచ్చాయి. సెప్టెంబర్లో లీగ్ జరిపేందుకు వార్విక్షైర్, సర్రే, మిడిల్సెక్స్, లాంక్షైర్ ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు ఆ క్లబ్లు తెలియజేశాయి. మరోవైపు ఎప్పుడు నిర్వహించినా 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను డబుల్ హెడర్లుగా 20 రోజుల్లో ముగించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఇంగ్లండ్లో టీమ్ఇండియా పర్యటన సెప్టెంబర్ 14న ముగియనుండగా.. ఆ తర్వాతే ఐపీఎల్ జరుపాలని భారత బోర్డు ఆలోచిస్తున్న తరుణంలో ఇంగ్లిష్ క్లబ్లు ముందుకొచ్చాయి.
మిగిలిన మ్యాచ్లు అప్పుడే
ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్లో నిర్వహించేలా ప్రయత్నిస్తామని గంగూలీ చెప్పాడు. అక్టోబర్లో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ కంటే ముందు టోర్నీ రెండో దశను జరిపేందుకు మిగిలిన దేశాల క్రికెట్ బోర్డులతో చర్చిస్తామని అన్నాడు. దీనికి ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయని చెప్పాడు. ఒకవేళ ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహించలేపోతే బీసీసీఐకి దాదాపు రూ.2500కోట్ల నష్టం వస్తుందని సౌరవ్ అన్నాడు.
పొరపాటు కానేకాదు
కరోనా సంక్షోభ సమయంలో ఐపీఎల్ నిర్వహించడం పట్ల బీసీసీఐపై వస్తున్న విమర్శలను దాదా కొట్టిపారేశాడు. తాము ఐపీఎల్ స్వదేశంలో నిర్వహించాలని నిర్ణయించినప్పుడు భారత్లో కరోనా కేసులు అత్యల్పంగా ఉన్నాయని, చివరి మూడు వారాలుగానే అనూహ్యంగా పెరిగాయని అన్నాడు. రేపు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని దాదా చెప్పాడు. ‘ఈ సీజన్ కూడా యూఏఈలో నిర్వహిద్దామన్న చర్చ జరిగింది. అయితే ఫిబ్రవరిలో భారత్లో కరోనా ప్రభావం స్వల్పంగానే ఉండడంతో ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించాం. గత మూడు వారాలుగానే దేశంలో వైరస్ ఉద్ధృతి పెరిగింది’అని గంగూలీ చెప్పాడు.