న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్గా భారత స్టార్ షట్లర్ పీవీ సింధుతో పాటు మిచెల్లీ లీ(కెనడా) ఎంపికయ్యారు. ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ ప్రచారంలో భాగంగా వీరిని ప్రచారకర్తలుగా నియమించినట్లు ఐవోసీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఐవోసీ ప్రచారకర్తగా ఎంపికవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. పోటీపడటంలో ఎలాంటి మోసాలకు పాల్పడకుండా పోరాడటంలో సహచర అథ్లెట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. అందరం కలిసి మెరుగైన క్రీడా వాతావరణాన్ని నెలకొల్పుదాం’అని సింధు పేర్కొంది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బాయ్) ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా స్పందిస్తూ ‘ఆటపై సింధుకు ఉన్న నిజాయితీకి తగిన గుర్తింపు లభించింది. ఇన్నేండ్లుగా ఆటను ప్రేమిస్తూ అంకితభావం ప్రదర్శించి అత్యుత్తమ స్థాయికి ఎదిగింది’ అని అన్నారు