న్యూఢిల్లీ: కరోనా వేగంగా, తీవ్రంగా విస్తరిస్తున్నది. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. చావులు పెరిగిపోయి శ్మశానాల్లో రద్దీ ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కొందరు లాక్డౌన్ తప్పదని అంటున్నారు. కొందరు అది ఆర్థిక కడగండ్లకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇందులో ఏది ఉత్తమం? అంటే లాక్డౌన్ చర్చకు అతీతంగా పరిష్కారాలను అన్వేషించాలని కోవిడ్-19పై ఏర్పాటైన లాన్సెట్ ఇండియా టాస్క్ఫోర్స్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. లాక్డౌన్ అవసరం లేదని పది మందికి మించి ఎక్కడా గుంపులు గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని తెలిపింది. తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. కరోనా విస్తరణ స్థాయిని బట్టి వ్యూహాలు రూపొందించుకోవాలని పేర్కొన్నది. ఆర్థిక పర్యవసానాలు అన్నిటిని పరిగణనలోకి తీసుకుని, సమాజంలోని వివిధ వర్గాలను సంప్రదించి, నిస్సహాయ వర్గాల రక్షణకు కార్యక్రమాలు, చొరవలు చేపట్టిన తర్వాతే ఏదైనా నిర్ణయం జరగాలని స్పష్టం చేసింది. లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయేవారి గురించి తప్పక ఆలోచించాలని నొక్కిచెప్పింది. స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కోచోట ఒక్కోరకం చర్యలు అవసరం కావచ్చని అభిప్రాయపడింది. వేగంగా విస్తరిస్తున్న చోట తీవ్రస్థాయిలో నియంత్రణలు అవసరం కావచ్చని, తక్కువ తీవ్రత ఉన్నచోట నివారణ చర్యలు సరిపోతాయని తెలిపింది.