ధర్మపురి, ఏప్రిల్ 30: క్యాన్సర్తో బాధపడుతున్న ఓ పేద మహిళకు ఫేస్బుక్ మిత్రులు అం డగా నిలిచారు. రూ. 1.03లక్షల సాయం చేసి ఔదార్యంచాటుకొన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన గంగాధరి రమ్యజ్యోతి కొద్దినెలల క్రితం అనారోగ్యానికి గురైంది. వైద్యులను సం ప్రదించగా బ్లడ్ క్యా న్సర్ ఉన్నట్టు చెప్పారు. రమ్యజ్యోతి భర్త ప్రైవేటు అధ్యాపకుడిగా పనిచేస్తుండగా కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయాడు. జ్యోతి వైద్యంకోసం దొరికిన చోటల్లా అప్పులు చేసి లక్షలు ఖర్చు చేశారు. అప్పు తీర్చేందుకు ఉన్న ఒక్క స్థలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంకా కొన్ని నెలలు వైద్యం చేయించాల్సి ఉండగా ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి మిత్రుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ స్పందించి రమ్యజ్యోతి దీనగాథను ఆమె బ్యాంక్ వివరాలతో సహా ఫేస్బుక్లో పోస్టు చేసి ఆదుకోవాల్సిందిగా మిత్రులను కోరాడు. స్పందించిన తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్నారై మిత్రులు రమ్యజ్యోతి బ్యాంక్ ఖాతాలో రూ.1.03 లక్షలను జమచేశారు. ఈ సందర్భంగా సాయం అందించిన ఫేస్బుక్ మిత్రులకు రమ్యజ్యోతి, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.