నగరంలో కలవడంతో అభివృద్ధి బాటలు
కడిపికొండలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి రోడ్షో
మడికొండ, ఏప్రిల్ 27: గ్రేటర్లో విలీనమైన గ్రామాల స్వరూపాన్ని మార్చి, పట్టణ వాతావరణం కల్పించేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కడిపికొండ, రాంపేట, తరాలపల్లిలో మంగళవారం ఆయ న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మా ట్లాడుతూ కడిపికొండ, తరాలపల్లి గ్రామాలు నగరానికి దగ్గరగా ఉన్నాయని, అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. గతంలో వడ్డేపల్లి, మట్టెవాడ సైతం గ్రామాలుగా ఉండేవని ఇప్పుడు నగరంలో కలిసిపోయి అభివృద్ధి చెందాయని చెప్పారు. గ్రామాల్లో యువత ఎక్కువగా ఉందని, వారిలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కడిపికొండ కేంద్రంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. స్థానిక విద్యార్థులకు మంచి విద్యనందించేందుకు కేంద్ర మంత్రితో కడిపికొండలో కేంద్రీయ విద్యాలయానికి శంకుస్థాపన చేయించినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకనే విలీన గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. మెరుగైన విద్య కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్పొరేటర్లను గెలిపిస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు. అభ్యర్థుల ఎంపికలో స్థానికత అంశాన్ని చూడొద్దని, ఊర్లను గ్రామాలుగా కాకుండా డివిజన్గా చూడాలని కోరారు. పనిచేసే వా రిని గెలిపిస్తేనే గ్రామం బాగుపడుతుందన్నారు.
అయోధ్యపురంలో సీతారాం నాయక్
మాజీ ఎంపీ సీతారాం నాయక్ అయోధ్యపురంలో ఇంటింటా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై విజ్ఞతతో ఆలోచించి ఆ పార్టీ అభ్యర్థులకు ఓటెయ్యాలని కోరారు. కాంగ్రెస్కు నాయకుడే కరువయ్యాడని, నాయకత్వం లేని పార్టీకి ఓటేస్తే వృథాగా పోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్ముతోందని, కోచ్ ఫ్యాక్టరీ కోసం తెలంగాణ ప్రభుత్వం దేవాలయ భూములను రైల్వేకు అప్పగిస్తే పట్టించుకోవడం లేదని చెప్పారు. పైగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హేలన చేస్తున్నారని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు.