ఆదిలాబాద్ రిమ్స్లో కొవిడ్ బాధితులకు చికిత్సలు
అందుబాటులో 295 ఆక్సిజన్ బెడ్స్
కొరత లేకుండా అధికారులచర్యలు
ఆదిలాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా సర్కారు దవాఖానల్లో అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నది. సిబ్బంది, మందులు, స్కానింగ్ పరికరాలు అన్నింటిని అందుబాటులో పెట్టంది. టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించి 50 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నది. కాగా.. ఏడాదికాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నియంత్రణకు కూడా పకడ్బందీ చర్యలు చేపట్టింది. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సలు అందించడానికి గ్రామాల్లో ర్యాపిడ్ కిట్ల ద్వారా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నది. వైరస్ సోకిన వారికి అవసరమైతే జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరిలిస్తున్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి ఉచితంగా మందులు అందించి, వైద్యులు వారికి చికిత్సలు చేస్తున్నారు. దీంతో జిల్లాలో 98 శాతం కొవిడ్ బాధితులు వైరస్ నుంచి కోలుకుంటున్నారు.
అందుబాటులో ఆక్సిజన్
కొవిడ్ వైరస్ సోకిన వారికి శరీరంలో ఆక్సిజన్ శాతం క్రమంగా పడిపోతున్నది. ఆక్సిజన్ లెవన్ 94కు చేరుకుంటే వారికి ప్రాణవాయువును అందించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో 510 బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 110 ఐసోలేషన్ బెడ్స్, 295 ఆక్సిజన్, 105 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. చికిత్సలో భాగంగా అవసరమైన పేషేంట్లకు రిమ్స్ వైద్యులు ఆక్సిజన్ అందిన్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత ఉన్నా జిల్లాలో మాత్రం ఈ సమస్య లేకుండా పోయింది. మూడేళ్ల కిందట రిమ్స్లో ఆక్సిజన్ స్టోరేజ్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఇందులో 6వేల లీటర్ల ఆక్సిజన్ నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ప్రాణవాయువు కొరత లేకుండా అధికారులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ను తెప్పించుకునే నిల్వ చేస్తున్నారు. వీటితోపాటు సిలిండర్లను కూడా అందుబాటులో ఉంచుతూ అవసరమైన వారికి అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న వారికి ఐసీయూలో చికిత్సలు అందిస్తున్నారు. చికిత్సలో భాగంగా బాధితులకు రెమిడిసివిర్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు.