ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్
రెండు మున్సిపాలిటీల్లో ముమ్మరంగా..
జడ్చర్ల తొలి పోరులో గులాబీ దూకుడు
పాలాది రామ్మోహన్ చేరికతో బీజేపీ పని గోవిందా
అచ్చంపేటలో మరోసారి విజయబావుటా దిశగా..
ప్రచారంలో పాల్గొంటున్న విప్ గువ్వల, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మహబూబ్నగర్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మినీ మున్సిపల్ పోరులో టీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నది. మొదటి రోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో జడ్చర్లలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి విస్తృతంగా పర్యటించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు పాలాది రామ్మోహన్ సుమారు 300మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. దీంతో జడ్చర్లలో బీజేపీ పని అయిపోయినట్లేనని భావిస్తున్నారు. మరోవైపు అచ్చంపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి వార్డుల్లో పర్యటిస్తున్నారు. అచ్చంపేటలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మరోసారి కూడా తమకే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా తొలిరోజు రెండు మున్సిపాలిటీల్లో ప్రచారం హోరెత్తింది.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ జడ్చర్ల
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న జడ్చర్ల పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారథ్యంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ 27 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉదయం నుంచే అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. తొలిసారి జరుగుతున్న జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ అందించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. జడ్చర్లను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మార్చామని ఓటర్లకు తెలుపుతున్నారు. పట్టణంలోనే 1500 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నామని.. వీటి ద్వారా ప్రతి పేదవారికి సొంతింటి కల సాకారమవుతుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అత్యంత కీలకమైన జడ్చర్ల పట్టణాన్ని భవిష్యత్లో ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. పట్టణంలోని 27వార్డులు కైవసం చేసుకుని చరిత్ర సృష్టిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ ముఖ్య నేత పాలాది రామ్మోహన్ పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరడంతో జడ్చర్లలో కమలనాథుల పని గోవిందా అన్నట్లుగా మారింది. శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 10,11 వార్డుల్లో ప్రచారం చేశారు.
అచ్చంపేటలో క్లీన్ స్వీప్పై గురి
గత మున్సిపల్ ఎన్నికల్లో 20వార్డులకు గానూ అన్నింటిని కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. అచ్చంపేటలో రెండోసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో విప్, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో కౌన్సిలర్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. 3,4,5,16,17 వార్డు అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చంపేట పట్టణంలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరిస్తున్నారు. అచ్చంపేట మరింత అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీకే పట్టం కట్టాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచార రథంలో వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. సీసీరోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, కమ్యూనిటీ హాళ్లు, అంబేద్కర్ కళాభవన్, స్మృతివనం, ఓపెన్ జిమ్, డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర అంశాలను వివరిస్తున్నారు. త్వరలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందని.. ఫ్రీ కోచింగ్ ఇస్తామని యువతకు భరోసానిస్తున్నారు.