ఖమ్మం, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ నేతలకు కలలో కూడా తానే కనబడుతున్నానని, తనను కలువరించకుండా వారికి ఒక్కరోజు కూడా నిద్రపట్టడం లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఎద్దేవా చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్తో కలిసి శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం అభివృద్ధికి ప్రభుత్వ కృషిని ఓర్వలేక కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. ఖమ్మం నగర అభివృద్ధి టీఆర్ఎస్ వల్లే సాధ్యమని, నగర ప్రజలు ఎప్పుడో తమను ఆశీర్వదించారన్నారు. తాను ఎవరినీ బెదిరించాల్సిన అవసరంలేదని, తన పేరిట విడుదలైన ఆడియో నకిలీదని, తన స్వరమే కాదని ఆయన స్పష్టం చేశారు. మధిర మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించుకోలేని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఖమ్మంలో ఏం చేస్తారని, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడెలా చెల్లుతుందని మంత్రి ప్రశ్నించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు.
ఖమ్మంలో జోరుగా టీఆర్ఎస్ ప్రచారం..
ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. శుక్రవారం పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, మాగంటి గోపీనాథ్, మంత్రి పువ్వాడ సతీమణి వసంతలక్ష్మి వేర్వేరుగా ప్రచారం చేశారు.