న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: హైదరాబాద్ ఫార్మా దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా సమర్థంగా పనిచేస్తున్నదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. కరోనా వైరస్కు చెందిన పలు ఉత్పరివర్తనాలతోపాటు, డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్నూ ఈ టీకా సమర్థంగా అడ్డుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ బుధవారం ట్వీట్ చేసింది. మరోవైపు, కొవాగ్జిన్ మూడోదశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ వెల్లడిస్తూ.. తమ టీకా వేసుకున్నవాళ్లకు కరోనా నుంచి గణనీయమైన రక్షణ లభిస్తుందని, చికిత్స కోసం దవాఖానకు వెళ్లాల్సిన పరిస్థితే తలెత్తటం లేదని రుజువైందని తెలిపింది. భారత్తోపాటు పలు దేశాల్లో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్కు ఇప్పటికే అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-అస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్తోపాటు కొవాగ్జిన్ టీకాను ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్నారు. బ్రిటన్ (బీ.1.1.7), బ్రెజిల్ (బీ.1.1.28), దక్షిణాఫ్రికా (బీ.1.351) కరోనా రకాలను (వేరియంట్లను) ఐసీఎంఆర్-ఎన్ఐవీ ఇటీవల విజయవంతంగా వేరుచేసి అధ్యయనం జరిపింది. ఈ వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలిందని ఐసీఎంఆర్ తాజాగా వెల్లడించింది. అలాగే భారత్లో పలు చోట్ల వ్యాప్తిలో ఉన్న డబుల్ మ్యుటెంట్ (రెండుసార్లు ఉత్పరివర్తనం చెందిన) బీ.1.617 వైరస్ను కూడా ఐసీఎంఆర్-ఎన్ఐవీ ఇటీవల విజయవంతంగా వేరుచేసింది. దీనిపైనా కొవాగ్జిన్ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలిందని ఐసీఎంఆర్ తెలిపింది.
తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైన కరోనా కేసులపై కొవాగ్జిన్ టీకా 78 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. తమ టీకా వేసుకుంటే కరోనా చికిత్స కోసం దవాఖానలో చేరాల్సిన అవసరం వందకు వందశాతం ఉండబోదని ప్రకటించింది. ఈ మేరకు ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ రెండో మధ్యంతర ఫలితాల్లో వెల్లడైనట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. వ్యాక్సిన్ సామర్థ్యం 78 శాతంగా తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. అలాగే లక్షణాలు కనిపించని కరోనా కేసుల్లో టీకా సామర్థ్యం 70 శాతంగా ఉన్నదని, దీన్ని బట్టి టీకా తీసుకున్నవారిలో వైరస్ వ్యాప్తి తగ్గినట్టు తెలుస్తున్నదని పేర్కొన్నది. క్లినికల్ ట్రయల్స్లోనూ, అత్యవసర వినియోగంలోనూ కొవాగ్జిన్ అత్యంత సురక్షితమని తేలిందని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా తెలిపారు. భారత్లో అభివృద్ధి చేసిన అంతర్జాతీయ టీకా కొవాగ్జిన్ అని పేర్కొన్నారు. తుది ఫలితాలు జూన్లో విడుదల కానున్నాయని ఆయన వెల్లడించారు. కొవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ లో 18-98 ఏండ్ల మధ్య వయసున్న దాదాపు 25,800 మంది వలంటీర్లు పాల్గొన్నారు. వీరు పది శాతం మంది 60 ఏండ్లు పైబడినవారు.