సెకండ్ వేవ్ నియంత్రణకు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
మందులు, ఆక్సిజన్, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచండి
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అదనపు పడకల ఏర్పాట్లు
తాత్కాలిక ప్రాతిపదికపై సిబ్బంది నియామకానికి చర్యలు
సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు పరీక్షల సంఖ్య పెంచాలి
వ్యాక్సినేషన్లో రాష్ట్రంలోనే కామారెడ్డి టాప్
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అధికారులతో సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 17: కొవిడ్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ప్రశాంత్రెడ్డి సూచించారు. నిజామాబాలోని ప్రగతిభవన్లో కలెక్టర్, పోలీసు కమిషనర్, ఇతర అధికారులతో కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ పరీక్షలు పెంచడం, అవసరమైన వారికి చికిత్సలు అందించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా అవగాహన కల్పించడం, అర్హులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. జిల్లాలోని 42 కేంద్రాల్లో రోజుకు సుమారు ఐదువేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అవసరమైన కిట్లను అందజేయడానికి రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. అవసరం మేరకు మరో ఆరు క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు కోసం అధికారులకు సూచించామన్నారు.
నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానల్లో ప్రస్తుతం 405 ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, వీటిని 700కు పెంచుతామన్నారు. జిల్లాలోని 70 ప్రైవేటు దవాఖానల్లో 1400 వరకు బెడ్లు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రైవేటు దవాఖానలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫీజులు తీసుకోవాలని, ఎక్కువ తీసుకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైరస్ నుంచి రక్షించుకోవడానికి ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని, దీనికి పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు తగిన అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. సరిహద్దుల్లో చెకింగ్ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని, మాస్కులు లేకుండా ఇంట్లో నుంచి బయటికి వస్తే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరిమానాలు విధించాలన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 33 అంబులెన్సులు పనిచేసే విధంగా చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఒత్తిడి ఉంటే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం మీకు తోడుగా ఉంటుందని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, అధికారులు పాల్గొన్నారు.