చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 11 : గ్రామాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పనులతో గతంలో పేరుకుపోయిన సమస్యలు తొలగిపోయాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామం అభివృద్ధిలో ముందున్నది. ప్రగతి పనులన్నీ పూర్తి చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో 2900 జనాభా ఉండగా 2300 మంది ఓటర్లు ఉన్నారు.
రూ.కోటితో అభివృద్ధి
ఊరెళ్ల గ్రామంలో ఇప్పటివరకు దాదాపు రూ.కోటితో అభివృద్ధి పనులు చేపట్టారు. సర్పంచ్ ఎండీ.జహంగీర్ గ్రామాభివృద్ధిలో రాజీ లేకుండా రూ.30 లక్షలు సొంత నిధులు సైతం వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు.
సీసీ కెమెరాలు.. విద్యుత్ స్తంభాలు..
గ్రామంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సర్పంచ్ సొంత నిధులు కేటాయించి చేవెళ్ల పోలీస్స్టేషన్కు అనుసంధానం చేశారు. రూ.14లక్షలతో హైమాస్ట్ లైట్లు, సాగర్ ఇనిస్టిట్యూట్ సహకారంతో రూ.2లక్షల25వేలతో చెత్త సేకరణ వాహనం ఏర్పాటు చేయించి వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు.
మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు
గ్రామపంచాయతీలో సాత ఆత్మలింగం ఆధ్వర్యంలో రూ.5.5 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు మంచినీరు అందజేస్తున్నారు. ఊరెళ్ల ప్రభుత్వ పాఠశాలలో రూ.2లక్షల75 వేలతో బెంచీలు ఏర్పాటు చేయించారు.
పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులు వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, చెత్త డంపింగ్ యార్డు పనులు పూర్తయ్యాయి. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించి, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువులను తయారు చేస్తున్నారు.
అందంగా సీసీ రోడ్లు
గ్రామంలో ఏ వీధి చూసినా సీసీ రోడ్లతో అందంగా కనిపిస్తున్నది. రోడ్లకిరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలో నీటి సమస్య లేకుండా నిరంతరాయంగా మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నాయి. పారిశుధ్య నిర్వహణలో గ్రామం మండలంలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. మొత్తానికి సీఎం కేసీఆర్ పుణ్యమాని పల్లెలు పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో పోటీ పడుతుండడం విశేషం.
ముందస్తు ప్రణాళికతోనే అభివృద్ధి
ఇవీ కూడా చదవండి…