కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్లో శనివారం సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబాలను ఈ నెల 14న కలుస్తానని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సీతల్కుచిలోని 126 పోలింగ్ బూత్ వద్ద జవాన్ల కాల్పుల్లో నలుగురు చనిపోయిన ఈ ఘటనను మారణహోమంగా ఆమె అభివర్ణించారు. ఆదివారం సిలిగురిలో మాట్లాడుతూ.. జనాలను నియంత్రించేందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది కాళ్లు, మోకాలు కింద కాల్పులు జరుపడం బదులు మెడ, చెస్ట్లో కాల్పులు జరిపారని ఆరోపించారు. సీఐఎస్ఎఫ్కు జనాల్ని నియంత్రించడం రాదని, పరిశ్రమల రక్షణకు మాత్రమే వారు శిక్షణ పొందారని అన్నారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో వీడియో కాల్లో మమత మాట్లాడారు. రాజకీయ నేతల రాకపై ఈసీ మూడు రోజులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నెల 14న అక్కడకు వచ్చి వారిని కలుస్తానని చెప్పారు. నా ప్రజల బాధ, ఆవేదనను పంచుకుంటానని, ఈ ప్రపంచంలో ఏదీ కూడా తనను ఆపలేదని అన్నారు. మూడు రోజుల పాటు వారిని కలువకుండా తనను నిలువరించినా నాలుగో రోజున తప్పక కలుస్తానంటూ ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు.