మగ కవలలకు జన్మినిచ్చిన తల్లి
ములుగురూరల్, ఏప్రిల్ 5: ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన మహిళకు సోమవారం 108 సిబ్బంది పురుడు పోయగా, ఆమె మగ కవల శిశువులకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కావిరి మౌనిక గర్భవతి కాగా 7 నెలలకే పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఏటూరునాగారం సీహెచ్సీలో వైద్యులకు చూపించగా వారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రెఫర్ చేశారు. పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని మిషన్ హాస్పిటల్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆమెను 108 వాహనంలో హన్మకొండకు తీసుకెళ్తుండగా, వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు గ్రామం దాటిన తర్వాత మౌనికకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఈఎంటీ కనుకుంట్ల రాజేశ్, పైలట్ పోరిక కృష్ణ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి మౌనికకు ధైర్యం చెప్పడంతోపాటు సుఖప్రసవం చేశారు. మొదటి కాన్పులోనే మౌనిక ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. వెంటనే వారు తల్లితోపాటు ఇద్దరు పసిబిడ్డలను మిషన్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు తల్లి, బిడ్డలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. అనంతరం రాజేశ్, కృష్ణను వైద్యులు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీకి అభ్యర్థుల కొరత.. ఎంపీలను పోటీ చేయిస్తున్నది: సయంతిక బెనర్జీ
ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్.. పూర్తయిన ఆర్క్