హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అద్భుతాలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి సందర్శకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. వారాంతాల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటున్నది. దీంతో కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ను అభివృద్ధిచేయాలని నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం ఇందుకోసం రూ.350 కోట్లు కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. ఇందులోభాగంగా ముందుగా కాళేశ్వరం బ్యాక్వాటర్లో రెండుబోట్లను ప్రారంభించనున్నారు. వీటిల్లో ఒకటి 80 సీట్ల సామర్థ్యం కలిగిన క్రూయిజ్ బోటు కాగా, మరొకటి సాధారణ బోటు ఉండనున్నది. క్రూయిజ్బోట్ ప్రతిపాదన బోట్ తయారీకి ఇప్పటికే సంబంధిత సంస్థకు ఆర్డర్ ఇచ్చామని, సీఎం కేసీఆర్ అనుమతితో త్వరలోనే దానిని అందుబాటులోకి తెస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కాళేశ్వరం టూ ధర్మపురి..
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బరాజ్లు, పంప్హౌస్లు, రిజర్వాయర్ల చుట్టూ అమ్యూజ్మెంట్ పార్కులు, గార్డెన్లకు సంబంధించిన డిజైన్లపై కసరత్తు చేస్తున్నారు. పర్యాటకులు సేద తీరేందుకు కావాల్సిన వసతులతోపాటు పార్కుల్లో పిల్లల ఆటపరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురి వరకు సుమారు 170 కిలోమీటర్లు నీరు నిలిచే అవకాశం ఉండటంతో.. నాగార్జునసాగర్ టూ శ్రీశైలం తరహాలోనే కాళేశ్వరం నుంచి ధర్మపురికి బోటింగ్ ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం సిద్ధం చేస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…
నంది మేడారంలో కాళేశ్వర గంగ పరవళ్లు..
సీఎం కేసీఆర్కు మర్రి రాజశేఖర్రెడ్డి కృతజ్ఞతలు
అనుచరులతో టీఆర్ఎస్లో చేరిన మున్సిపల్ కౌన్సిలర్
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు