ఖమ్మం : వినూత్నమైన ఆలోచనలతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నామని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రూ. 25 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఆర్టీసీని కూడా బలోపేతం చేస్తూ లాభాల బాటలో పయనింపజేసేందుకు కార్గో లాంటి సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. ఆర్టీసీని మరింత లాభాల్లోకి తీసుకొస్తే.. మిగతా నగరాల్లోనూ ఆధునికమైన బస్టాండ్లను ఏర్పాటు చేసేందుకు వీలుంటుందన్నారు.
ఖమ్మం పట్టణాన్ని పువ్వాడ అజయ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. గాంధీ కూడలిని అద్భుతంగా సుందరీకరించారు. గత ఏడేళ్లుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర పట్టణాల ప్రజాప్రతినిధులు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. టేకులపల్లిలో 1004 ఇండ్లు ప్రారంభించుకున్నాం. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చాం. మనం చేసిన పనిని ప్రజలకు గుర్తు చేయాలి. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులను, ఇప్పుడున్న పరిస్థితులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సామాన్యుడికి సేవలందించడమే కాదు.. వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ముందుచూపుతో పని చేయాలని సీఎం సూచిస్తుంటారు.
ఖమ్మంలో ఇప్పటికే ఒక సమీకృత మార్కెట్ ఉంది.. మరో మూడు కావాలన్నారు తప్పకుండా మంజూరు చేస్తామన్నారు. ఖమ్మం కార్పొరేషన్లో ప్రజల ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని, నాయకులను ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు.. ఆదరిస్తారు అనే నమ్మకం ఉందన్నారు. కేంద్రం ఎన్నో మాటలు చెప్పింది.. కానీ నిలబెట్టుకోవడం లేదు. జీఎస్టీ బకాయిలు మన దగ్గర తీసుకోవడమే తప్ప తిరిగి ఇచ్చింది ఏం లేదు అని కేటీఆర్ అన్నారు.