భువనగిరి అర్బన్, మార్చి 30: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. మంగళవారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. యాసంగిలో వచ్చే ధాన్యం, పల్లెప్రకృతి వనాలు, ధరణి, హరితహారం, సమీకృత మార్కెట్ల ఏర్పాటు, కొవిడ్ పరీక్షలు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రైతులకు తాగునీరు. నీడ వసతి కల్పించాలన్నారు.కొవిడ్ దృష్ట్యా భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించేలా చూడాలన్నారు. ధాన్యం 17 తేమశాతం మించకుండా, తాలు లేకుండా కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు మరింత శోభను ఇస్తాయన్నారు.
స్థల సేకరణ జరగని చోట వెంటనే చర్యలు తీసుకుని పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధిహామీ నిధులు సద్వినియోగం చేసుకొని రైతు కల్లాలు, వైకుంఠధామాలు, రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. నర్సరీలో ప్రతి మొక్క బతికేలా నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు గ్రామాల్లోని నర్సరీలను పర్యవేక్షించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం త్వరగా జరిగేలా చూడాలన్నారు. ధరణి రిజిస్ట్రేషన్లు పెండింగ్లో లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పీహెచ్సీలు, ఏరియా, సివిల్ దవాఖానల్లో కొవిడ్ పరీక్షలు పెంచాలన్నారు. ప్రతి వారం వైద్య ఆరోగ్య, పోలీస్అధికారులతో పరిస్థితులు సమీక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అనితారామచంద్రన్, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, కీమ్యానాయక్, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, డీసీవో వెంకట్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి అబ్దుల్ అలీం, మార్కెటింగ్ శాఖ మేనేజర్ గోపీకృష్ణ, పౌరసరఫరాలశాఖ అధికారి బ్రహ్మరావు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థిగా పానుగోతు రవికుమార్
వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం