నిజాంసాగర్/ పిట్లం/ ఎల్లారెడ్డి/ గాంధారి/ నాగిరెడ్డిపేట్/ మార్చి 25 : కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పిట్లం మండలకేంద్రంలోని ఆరోగ్యకేంద్రంలో 46 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి శివకుమార్ తెలిపారు. నిజాంసాగర్ పీహెచ్సీలో 54 మందికి పరీక్షలు నిర్వహించగా.. నవోదయలో విధులు నిర్వహించే ఉపాధ్యాయుల కుటుంబీకులు ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఉపాధ్యాయులు కుటుంబీకులతో కలిసి పాఠశాలలోని క్వార్టర్స్లో ఉండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తున్కిపల్లి తండాలో మరొకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
పాఠశాలను పరిశీలించిన తహసీల్దార్
నిజాంసాగర్ నవోదయ పాఠశాలను తహసీల్దార్ వేణుగోపాల్ గురువారం సాయంత్రం పరిశీలించారు. పాఠశాల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరు మినహా మిగతా వారికి నెగెటివ్ వచ్చిందని తెలిపారు. మొత్తం 128 మంది విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో 17 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఒక పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్యసిబ్బంది తెలిపారు. 43 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశామని దవాఖాన సూపరింటెండెంట్ రవీంద్రమోహన్ తెలిపారు. మత్తమాల ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 53 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ వెంకటస్వామి తెలిపారు. ఆరోగ్యకేంద్రంలో 49మందికి టీకా వేశామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మధుసూదన్, వెంకట నారాయణ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. గాంధారి మండలకేంద్రంతోపాటు ఉత్తునూర్ పీహెచ్సీలో కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 62 మందికి పరీక్షలు నిర్వహించగా.. సోమారం తండాకు చెందిన ఒకరికి, యాచారం తండాకు చెందిన మరొకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు హరికృష్ణ తెలిపారు.
నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 26 మందికి, తాండూర్ గ్రామంలో 66 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు మండల వైద్యాధికారిణి నందిత తెలిపారు. అందరికి నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు.