‘మాకు సంకల్పం ఉన్నది. ప్రజల దీవెనలు సంపూర్ణంగా ఉన్నాయి. ఈ ధైర్యంతో మేము ముందడుగు వేస్తున్నాము. దుష్టశక్తుల ఆటలు కట్టించే నేర్పు, ఓర్పు మాకు ఉన్నాయి. ఏ గుండె ధైర్యంతో ఉద్యమాన్ని సాగించి, విజయం సాధించామో అదే స్ఫూర్తితో ఇప్పుడు బంగారు తెలంగాణ సాధించడానికి నడుం బిగించాం’. ఈ మాటలు 2014- 15 తొలి బడ్జెట్లోనివి. అనతికాలంలోనే ఈ మాటలను ఆచరణలో సత్యం చేసి చూపించింది ఈ ప్రభుత్వం.
నిన్నటి రోజును శోకిస్తూ చూడకు, అది తిరిగిరాదు. నేడు నీది, దానిని చక్కగా మెరుగుదిద్దుకో. మసక కమ్మిన రేపటి రోజును స్వాగతించు సాహసంతో నిర్భయంగా.. అన్న మహాకవి హెన్రీ వర్డ్స్వర్త్ కవిత్వంలోని పంక్తులు సీఎం కేసీఆర్ తన పరిపాలన ద్వారా చేతల్లో చూపిస్తున్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నిబద్ధతతో దూసుకుపోతున్నారు. ప్రజారంజక పాలనను అందిస్తున్నారు. ఈ ఏడేండ్లలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని అంచనాలకు మించి చేసి చూపించారు. దేశం నివ్వెరపోయేలా కేంద్రంతో సహా పలు రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకునేలా చేశారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అనడానికి నిదర్శనంగా కేసీఆర్ నిలుస్తున్నారు.
కరోనా మహమ్మారి ఆర్థికవ్యవస్థను కుదేలు చేసినా, కేంద్రం న్యాయంగా ఇవ్వవలసిన నిధులను మంజూరు చేయకపోయినా ప్రజలకు మేలుచేయాలనే తపన, అంకితభావం, సంకల్పబలం ఉంది. దాంతో ఇనుమడింపబడిన శక్తిని పునికిపుచ్చుకొని దూసుకుపోతున్నది ఈ ప్రభుత్వం. ఈ సంక్షేమ పథక రచనలోనే మానవీయ కోణం ఉంది. తెలంగాణ సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనం కోసం రూపొందించినవి కావు. శాశ్వత పేదరిక నిర్మూలనకూ, ఆత్మగౌరవం పెంపొందించే దిశగా అమలు చేయబడుతున్నవి.
2015- 16లో ఆరంభమైన సంక్షేమ పథకాలను నిధుల కేటాయింపుల్లో ఏటా రెట్టింపు చేస్తూ వచ్చారు. బీసీల సంక్షేమానికి 2,172 కోట్లు కేటాయించగా 2021- 22 నాటికి 5,522 కోట్లు ప్రతిపాదించారు. 2014 నాటికి 19 మాత్రమే ఉన్న బీసీ గురుకులాలను 281 వరకు పెంచారు. ఇలా అన్ని సామాజిక సమూహాల సంక్షేమం కోసం వినూత్న పథకాలను అమలు చేస్తున్నారు. గత పథకాలకు నిధుల కేటాయింపులు రెట్టింపు చేస్తూనే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందుకుగాను 1,000 కోట్ల నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేక చొరవ తీసుకుం టున్నది. టీఎస్ ప్రైడ్ పేరిట ఈ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు రాయితీలు, సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్నది. అందుకుగాను రూ.1,919 కోట్ల సబ్సిడీ మంజూరుచేసింది. ఈ బడ్జెట్లో ఎస్సీ ప్రగతినిధి నిమిత్తం రూ.21,306.85 కోట్లను, ఎస్టీల ప్రగతి నిధి కోసం 12,304.23 కోట్ల నిధులను ప్రతిపాదించటం ముదావహం.
నేడు తెలంగాణ సమాజం గొప్ప పరివర్తనకు లోనవుతున్నది. అత్యధిక సంఖ్యాకులు మధ్యతరగతిలోకి ప్రవేశిస్తున్నారు. అందుకు ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, జీవన ప్రమాణాలు మెరుగుపరచడం లాంటి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు కారణం. సీఎం కేసీఆర్ నిరంతరం కఠోర పరిశ్రమతో చేస్తున్న ఆలోచనలు, భవిష్యత్ దర్శనం, అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా సమసమాజ నిర్మాణానికి బాటలు వేస్తున్నారు. సమగ్ర కార్య ప్రణాళికలతో ముందుకుసాగుతున్నారు. ఇదంతా కండ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ప్రగతికి సజీవ సాక్ష్యం.