రూ. 16లక్షలతో మూడు ప్రకృతి వనాలు
షాద్నగర్ టౌన్, మార్చి 18: షాద్నగర్ మున్సిపాలిటీ అభి వృద్ధిలో ముందంజలో దూసుకెళ్తుతున్నది. పన్ను వసూలులో 2019లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడంతో పాటు స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులను సైతం కైవసం చేసుకున్నది. అదే స్ఫూర్తితో అభివృద్ధి పనులను మరింత వేగంగా చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రతి పనిలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీలోని ప్రతి వార్డు ఎంతో సుందరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రకృతి వనాలతో మున్సిపాలిటీ సుందరంగా మారింది. రూ. 16లక్షలతో మున్సిపాలిటీలోని మూడు ఎకరాలలో పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి సుమారు 7వేల మొక్కలను పెంచుతున్నారు. మొక్కలకు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులను వాడుతు న్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ ప్రకృతి వనంలో ప్రధా నంగా జామ, దానిమ్మ, సీతాఫల్, కానుగ, ఉసిరి, కుంకుడు, వేప,టేకు, నేరేడు, కరక్కాయ, పారిజాతం వంటి మొక్క లనునాటారు. నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడుతుండడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.
కంటికి రెప్పలా కాపాడుతున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశాం. మూడు ప్రదేశాలలోని మూడు ఎకరాల్లో సుమారు 7 వేల మొక్కలు నాటాం. ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడుతున్నాం. పట్టణ ప్రకృతి వనం లోని పచ్చని మొక్కలతో మున్సిపాలిటీ సరికొత్త శోభను సం తరించుకుంటుంది. అదే విధంగా హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.