భూపాలపల్లి టౌన్, మార్చి 16 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నా కొత్తపల్లి (ఎస్ఎం)గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదు. పల్లె ప్రగతి ద్వారా మండలంలోని 24 జీపీల్లో దాదాపు అన్ని పనులూ పూర్తయి రూపురేఖలు మారుతున్నా ఇక్కడ మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. సీసీ రోడ్ల నిర్మాణం అంతంత మాత్రంగానే ఉండగా డైనేజీలు లేక మరుగునీరు రోడ్లపైకి వచ్చి వీధులన్నీ కంపు కొడుతున్నాయి. ఇక పాఠశాల ఆవరణలో నర్సరీని మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనం అధ్వానంగా ఉంది. వైకుంఠధామం, డంపింగ్ యార్డు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇంటి పన్నులు సకాలంలో వసూలవుతున్నా అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు.
పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వైకుంఠధామం కోసం రూ.13.40 లక్షలు, రూ.2.5 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.2.40 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.1.80 లక్షలు నర్సరీ పనులు ప్రారంభించినా ఇంకా పూర్తికాలేదు. వైకుంఠధామం, డ్రెస్సింగ్ భవన పనులు ఇంకా పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితమే స్లాబ్ వేసేందుకు సెంట్రింగ్ మొదలుపెట్టారు. ఇక పల్లె ప్రకృతి వనం పనులు మొక్కుబడిగా ప్రారంభించి వదిలేశారు. ఇందులో కొన్ని మొక్కలు నాటినా నీళ్లు సరిగా పెట్టకపోవడంతో రంగుమారిపోయాయి. అంతేగాక పిచ్చిమొక్కలు, గడ్డి ఏపుగా పెరిగి కళావిహీనంగా ఉంది. అటువైపు వెళ్లేందుకు సరైన మార్గం కూడా లేదు. ఇసుక మేటలతో ఆ ప్రాంతమంతా అధ్వానంగా ఉంది. కనీసం ప్రకృతి వనం ముందు ఓ బోర్డు గానీ, గేటు గానీ పెట్టకపోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.
వైకుంఠధామం పనులు ఆలస్యమవుతున్నది నిజమే. మేస్త్రీ, కూలీలు దొరకడం లేదు. పల్లె ప్రకృతి వనానికి బోర్డు, గేటు పెట్టిస్తా. లోపల మొక్కల మధ్య పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డి తీయిస్తా. డంపింగ్ యార్డు దాదాపు పూర్తయింది. రంగులు వేయాల్సి ఉంది. పార్కు వద్ద రోడ్డు సౌకర్యం, డ్రైనేజీల నిర్మాణాల కోసం తీర్మానం చేసినం. పనులు త్వరలోనే పూర్తి చేయిస్తా.
– పీ రఘు, సర్పంచ్
భూపాలపల్లి మండలంలో కొత్తపల్లి గ్రామం ఒక్కటే పనుల్లో వీక్గా ఉంది. అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కింద చేపట్టిన పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. త్వరగా పూర్తి చేయించాలని సర్పంచ్, కార్యదర్శికి చాలాసార్లు చెప్పాం. అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తయ్యేలా చూస్తా.
– అనిల్, ఎంపీడీవో