గువహటి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జిన్నా అడుగుజాడల్లో నడుస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం దిబ్రూగర్లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి శివరాజ్ చౌహాన్ మాట్లాడారు. కాంగ్రెస్ మహాత్మాగాంధీ బాటలో పయనించడం లేదని రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు జిన్నా అడుగుజాడల్లో నడుస్తున్నారని, ఇది అసోంతో పాటు భారత్ విచ్ఛిన్నానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసోంలో ఏఐయూడీఎఫ్, కేరళలో ఐయూఎంఎల్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ చేపట్టలేదని విమర్శలు గుప్పించారు. అసోంలో చొరబాట్లను ప్రేరేపించిన బద్రుద్దీన్ అజ్మల్తో కాంగ్రెస్ జట్టుకట్టిందని, ఫెర్ఫ్యూమ్ వ్యాపారం చేసే ఆయన సమాజంలో విషాన్ని వ్యాపింపచేస్తున్నారని దుయ్యబట్టారు. బద్రుద్దీన్ అజ్మల్కు చెందిన ఏఐయూడీఎఫ్తో కాంగ్రెస్ చేతులుకలపడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం తరుణ్ గగోయ్ సైతం ఆ పార్టీతో జట్టుకట్టలేదని అన్నారు. అసోంలో భిన్న తెగలు, వర్గాల మధ్య రాహుల్ గాంధీ అంతరాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.