నేటి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల దాకా ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో 1.84లక్షల మంది ఓటర్లు
బరిలో 71మంది అభ్యర్థులు
పల్లాకు వెల్లువలా మద్దతు.. సర్కారు పథకాలే రక్ష
వరంగల్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నేడు పోలింగ్ జరుగనుండగా అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బూత్లలో ఓటర్లు కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ సమయం కాగా, శనివారం సాయంత్రం వరకే ఆరు జిల్లాల పరిధిలోని 199 పోలింగ్ కేంద్రాలకు సామగ్రి సహా సిబ్బందిని తరలించింది. మొత్తం నియోజకవర్గంలో 5,05,368 మంది, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,84,897మంది ఓటర్లుండగా, బరిలో 71మంది అభ్యర్థులు నిలువడం ఆసక్తి రేపుతున్నది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక చివరి అంకానికి చేరింది. ఆదివారం పోలింగ్ జరుగనుండగా అధికారయంత్రాం గం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని నియోజకవర్గంలో 5,05,368 మంది ఓటర్లు ఉన్నారు. 71 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,84,897 మంది ఓటర్లుండగా, అధికారులు 199 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పో లింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8గంటలకు మొదలు కానుంది. సా యంత్రం నాలుగు గంటల వరకు జరగనుం ది. బరిలో నిలిచిన వారు ఎక్కువ మంది ఉం డడంతో మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పెద్ద సైజు బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. పోలింగ్ ప్రక్రియ కోసం అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.
సామగ్రి మొత్తం శనివారం సాయంత్రం వరకే పోలింగ్ కేంద్రాలకు చేరింది. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బరిలో ఈసారి ఎక్కువ మంది ఉండగా టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పోటీలో నిలిచారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుటికంటే ముందునుంచే ఆయన ప్రతి మండలంలో, కొన్ని గ్రామాల్లోనూ ఓట ర్లు స్వయంగా కలిసి మద్దతు కోరుతూ వచ్చా రు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, చీఫ్విప్ వినయభాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్ పర్స న్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉండనున్నాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కంటే ప్రచారంలో ముందుండడం కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు.
17న లెక్కింపు..
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఈసారి ప్రాధాన్యత పెరిగింది. పోటీలో ఉన్న వారు ఎక్కువ మంది కావడంతో ప్రచారంలోనూ గతంలో కంటే అంతే హడావుడి కనిపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న చేపట్టనున్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఓట్ల లెక్కించనున్నారు.