సూర్యాపేట టౌన్, మార్చి 12 : పట్టభద్రులంతా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షాల అడ్రస్ గల్లంతుకాక తప్పదని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో టీఎన్జీఓ, టీఈఈఏ, తెలంగాణ దివ్యాంగుల సంఘాల పట్టభద్రులు, సువెన్ ఫార్మా ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాలతో పాటు టీఆర్ఎస్ సమావేశాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు, విద్యావంతులు ఆత్మీయ సమావేశాలకు ఆహ్వానించి ఏకగ్రీవ మద్దతు తెలుపుతూ తీర్మాన పత్రాలు అందజేయడం చాలా ఉత్సాహాన్నిస్తున్నదన్నారు. ఉమ్మడి పాలకుల హయాంలో తెలంగాణకు జరిగిన నిర్లక్ష్యాన్ని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరేండ్లలో జరిగిన అభివృద్ధిని పోల్చిచూడాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలు గుర్తెరిగిన గొప్ప నాయకుడని, వారి కష్టాలను తీరుస్తూ నిరంతర అభివృద్ధి పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమాతో పాటు పలు వినూత్న పథకాల అమలుతో తెలంగాణ రికార్డు సృష్టిస్తున్నదన్నారు.
స్వరాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న ఉద్యోగులకే బాగా తెలుసని మంత్రి పేర్కొన్నారు. ఒక కుటుంబంలోని పిల్లలు ఒకరు బలంగా మరొకరు బలహీనంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు బలహీనుల గురించే ముందుగా ఆలోచించినట్లు సీఎం కేసీఆర్ సైతం అదే ప్రాధాన్యాలతో పాలన సాగిస్తున్నారని తెలిపారు. ముందుగా పేదల ఆకలి తీర్చడంపై దృష్టి సారించారని, ఇకమీదట ఉద్యోగులు, విద్యావంతుల వంతేనని చెప్పారు. సీఎం కేసీఆర్, ఉద్యోగులది తండ్రీ పిల్లల బంధమని, వారి సమస్యలు ఎప్పటికైనా ఆయనతోనే పరిష్కారమవుతాయనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉన్నదని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెన్నుచూపకుండా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్ని సంస్థలను అమ్ముతున్నదని, ఉద్యోగులను వీధిన పడేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నదని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు అభివృద్ధిలో తెలంగాణతో సరితూగగలవా? అని ప్రశ్నించారు.
ఆయా సమావేశాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.