లండన్ : ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్తో రక్తం గడ్డకట్టే ప్రమాదం పొంచిఉందని ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో ఐరోపా యూనియన్ వైద్య నియంత్రణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్తో బ్లడ్ క్లాట్స్ రిస్క్ పెరుగుతున్నట్టు ఎలాంటి సంకేతాలు లేవని ఆ సంస్థ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న జనాభాలో ఈ సంఖ్య అతి తక్కువగా ఉందని వ్యాఖ్యానించింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ను బ్లడ్ క్లాట్స్ పెరుగుతున్నాయనే భయంతో డెన్మార్క్, నార్వే సహా పలు ఐరోపా దేశాల్లో దీని వాడకాన్ని నిలిపివేసిన క్రమంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కొద్దిమందిలో రక్తం గడ్డకడుతున్న కేసులు వెలుగుచూస్తున్నాయనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వ్యాక్సినేషన్తో ఈ పరిస్ధితులు తలెత్తుతున్నాయని ఇప్పటివరకూ ఎలాంటి విస్పష్ట సంకేతాలు లేవని సైడ్ఎఫెక్ట్స్ జాబితాలో లేని లక్షణాలు వెలుగుచూడలేదని ఐరోపా వైద్య మండలి (ఈఎంఏ) స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలపై పరిశోధనలు కొనసాగుతున్న క్రమంలో ఈ రిస్క్ల కంటే వ్యాక్సిన్తో ప్రయోజనాలే అధికంగా ఉన్నందున వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలని ఈఎంఏ పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న యాభై లక్షల మంది ఐరోపా వాసుల్లో కేవలం 30 కేసుల్లోనే ఇలాంటి రిస్క్లు తలెత్తాయని తెలిపింది.