తిరుమల : కరోనా మహమ్మారి నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఈ నెల 18న 11వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సుందరకాండలోని 45వ సర్గ నుంచి 48వ సర్గ వరకు ఉన్న 156 శ్లోకాలను పారాయణం చేయనున్నారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొనున్నారు. కాగా, ఇప్పటి వరకు టీటీడీ పది అఖండ పారాయణాలను విజయవంతంగా నిర్వహించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయనుంది.
తిరుపతిలోని కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. సాయంత్రం 6.30గంటలకు అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, మేదినిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు వాహనసేవలపై స్వామివారు విహరించనున్నారు. శనివారం పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. 14న చిన్నశేష వాహనం, 15న సింహ వాహనం, ముత్యపు పందిరి, 16న పల్లకీ ఉత్సవం, గరుడ వాహనం, 18న హనుమంత వాహనం, గజవాహనం, 19న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనం, 20న సర్వభూపాల వాహనం, అశ్వవాహనం, 21న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి.