న్యూఢిల్లీ, మార్చి 6: ఉత్తరాఖండ్లో కొన్నేండ్లుగా కురుస్తున్న భారీ వర్షాలు, నాలుగు దశాబ్దాలుగా పెరిగిన ఉష్ణోగ్రతలు, ఫిబ్రవరి 4-6వ తేదీల్లో పశ్చిమ అలజడుల వల్ల ఏర్పడిన భారీ అవపాతం… చమోలీ జిల్లాలో జలవిలయానికి ఇవే కారణమని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవెలప్మెంట్ (ఐసీఐఎమ్వోడీ) తన నివేదికలో వెల్లడించింది. కాఠ్మాండూకు చెందిన ఐసీఐఎమ్వోడీ శుక్రవారం ఈ నివేదికను విడుదల చేసింది. వాతావరణ మార్పుల కారణంగా చమోలీ జిల్లాలోని రోంటీ శిఖరాగ్రంపై కొండచరియల్లో పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొన్నది. విరిగిన కొండచరియలు జారుకుంటూ బురద, మంచును వెంట తీసుకురావడం, ఈ క్రమంలో శిఖరం అంచువెంబడి రాపిడి వల్ల ఉష్ణోగ్రత పెరిగి మంచు కరిగిపోవడంతో రుషిగంగానదికి వరదలు సంభవించాయని తెలిపింది.