మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలు చేస్తున్న కూడా ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. మెగాస్టార్ లాంటి సీనియర్ హీరో వరసగా రీమేక్ సినిమాలు చేయడాన్ని తప్పు పడుతున్నారు విశ్లేషకులు. తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు లేనట్లు.. ఇక్కడ అసలు మంచి కథలు రానట్లు.. వరసగా రీమేక్ సినిమాలు ఒప్పుకోవడం ఏంటి అంటూ మెగాస్టార్ను ప్రశ్నించే వాళ్లు కూడా లేకపోలేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు చిరు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో రామ్ చరణ్, చిరంజీవి, పూజా హెగ్డేపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు కొరటాల శివ.
ఈ సినిమా తర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్లతో బిజీగా మారనున్నాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే తనపై వస్తున్న విమర్శలు తొలగించుకోవడానికి చిరంజీవి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన కోసం కమర్షియల్ కథలు సిద్ధం చేయాలని ఇండస్ట్రీలో కొందరు కుర్ర దర్శకులకు మెగాస్టార్ ఆదేశాలు పంపించాడు. దీనికి ఇద్దరు దర్శకుల నుంచి చిరంజీవికి కబురు కూడా అందినట్లు తెలుస్తోంది.
వాళ్లెవరో కాదు.. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల. ఇప్పటికే సంచలన దర్శకుడు అనిల్ రావిపూడి ఒక కథను సిద్ధం చేసి చిరంజీవికి వినిపించినట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి నరేషన్ మరో వారం రోజుల్లో వినిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెంకీ కుడుముల సైతం చిరంజీవికి ఒక లైన్ చెప్పాడని.. పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయాలని మెగాస్టార్ నుంచి ఆయనకు ఆర్డర్ కూడా వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇద్దరు కుర్ర దర్శకులు చిరంజీవి కోసం పోటీలో ఉన్నారు. మరి వాళ్లలో ఎవరు మెగాస్టార్ను తమ కథతో మెప్పిస్తారో..?