శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో హురియత్ కాన్ఫరెన్స్ నేత మీర్వాజ్ ఉమర్ ఫరూఖ్ విడుదలయ్యారు. కశ్మీర్లో పరిస్థితులు సద్దుమణగడంతో 20 నెలల తర్వాత మీర్వాజ్ ఫరూఖ్ను విడుదల చేసినట్లు రాజభవన్ వర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం నుంచి మీర్వాజ్ ఉమర్ ఫరూఖ్ను గృహనిర్బంధంలో ఉంచారు. కశ్మీర్ లోయలో నిరంతర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రభుత్వం చివరకు ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ మితవాద వర్గానికి చైర్మన్ మీర్వాజ్ ఉమర్ ఫారూఖ్పై విధించిన నిర్బంధాన్ని తొలగించింది. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలును దృష్టిలో ఉంచుకుని మీర్వాజ్ ఫారూక్ను 2019 ఆగస్టు 5 వ తేదీ నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు.
20 నెలల తరువాత గృహ నిర్బంధం నుంచి విడుదలైన మీర్వాజ్.. రేపు చారిత్రాత్మక జామియా మసీదులో నమాజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీర్వాజ్ 2019 ఆగస్టు నుంచి తన ఇంటి వెలుపల బహిరంగ సభల్లోగానీ సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లోగానీ పాల్గొనలేదు. అయినప్పటికీ, అతను తన ఇంటి నుంచే హురియత్ నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహిస్తున్నాడు. మీర్వాజ్ ఫరూఖ్ విడుదల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. కాగా, మీర్వాజ్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయడంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ హర్షం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ వెలుపల జైళ్లలో ఉన్న కశ్మీరీలను కూడా త్వరలో విడుదల చేయనున్నారని అక్కడివారు భావిస్తున్నారు.