అహ్మదాబాద్: గుజరాత్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్రూపానీ కాంగ్రెస్ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 45 సీట్లను మాత్రమే గెలుచుకుందని సీఎం రూపానీ చెప్పారు.
2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 389 సీట్లు గెలిచిన బీజేపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో మరో 100 స్థానాలు అదనంగా 489 స్థానాలు కైవసం చేసుకుందని విజయ్ రూపానీ తెలిపారు. గత ఎన్నికల్లో 174 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అంతకంటే ఘోరంగా 45 సీట్లకు పడిపోయిందన్నారు. చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని, కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా పోయిందని చెప్పారు. ఓటర్లు కాంగ్రెస్ పార్టీని గట్టిగా తిరస్కరించారని పేర్కొన్నారు.