నిజామాబాద్లో 958, కామారెడ్డిలో 2167 మొత్తం చెరువులు
మిషన్ కాకతీయతో గ్రామాల్లో పెరిగిన నీటి నిల్వ
నిండుకుండల్లా దర్శనమిస్తున్న వందలాది తటాకాలు
ఉభయ జిల్లాల్లో దంచి కొడుతున్న వాన.. ఉధృతంగా వరదనీరు
పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లు ..కాలనీలు జలమయం
నిజామాబాద్, జూలై 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. జలాశయాలు వరదనీటితో పోటెత్తుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 213 చెరువులు అలుగు పోస్తున్నాయని జలవనరులశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 3125 చెరువులు ఉండగా.. సగానికి పైగా జలకళతో తొణికిసలాడుతున్నాయి. పూడిక తీసిన, పునరుద్ధరించిన అనేక చెరువుల్లో వరద నీరు ప్రస్తుతం భారీగా నిల్వ ఉండడం మిషన్ కాకతీయ అందించిన సత్ఫలితాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. నాలుగు విడుతల్లో ఉభయ జిల్లాల్లోని సుమారు మూడు వేల చెరువులు బాగుపడగా.. ఇప్పుడవి జలకాంతులు నింపుకొన్నాయి. మరోవైపు జోరువానలకు నిజామాబాద్ నగరంతోపాటు పలుచోట్ల కాలనీలు జలమయం అయ్యాయి. పలు గ్రామాల్లో కాజ్వేలు, రహదారులు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది.
వానకాలం ప్రారంభం నుంచే అనుకూలిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో తటాకాలు జలకళను సంతరించుకుంటున్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టాన్ని మించి వరద పోటెత్తుతుండడంతో అలుగులు పారుతున్నా యి. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కనిపించాల్సిన జల సంబురం జూన్, జూలై నెలల్లోనే కానరావడంతో రైతుల్లో ఉత్సాహం కలుగుతున్నది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పూడిక తీసిన అనేక చెరువుల్లో వరద నీరు భారీగా నిల్వ ఉండడం కండ్ల ముందే కనిపిస్తున్నది. నాలుగు విడుతల్లో ఉభయ జిల్లాల్లో సుమారు 3వేల చెరువులకు మరమ్మతు చేయగా ప్రస్తుతం సత్ఫలితాలు వస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో 2167 చెరువులకు గాను 177 చెరువులు అలుగు పోస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 958 చెరువులకు 36 చెరువులు మత్తడి దుంకుతున్నట్లుగా జల వనరుల శాఖ అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
‘మిషన్’ తెచ్చిన జలానందం…
మిషన్ కాకతీయ ఫలితాలు మొదటిసారిగా 2016-17లో రైతుల అనుభవంలోనికి వచ్చాయి. 2017-18 యాసంగి నుంచి మొదలు నేటి వరకు ఇవే అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. జూన్ నెల నుంచే వర్షాలు బాగా పడుతుండడంతో గోదావరి బేసిన్లోని చెరువులు నిండు కుండల్లా మారాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 1941 చెరువుల్లో పూడిక తీసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.717.42 కోట్లు వెచ్చించింది. నాలుగు విడుతల్లో రెండు జి ల్లాల్లో 1650 చెరువులు పునరుద్ధరణకు నోచుకోగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ పథకం కింద 840 చెరువులను పునరుద్ధరించేందుకు నిర్ణయించారు. ప్రభుత్వం రూ.352.11 కోట్లు కేటాయించింది. 709 చెరువులు పూర్వవైభవం సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1101 చెరువుల్లో పూడిక తీసేందుకు నిర్ణయించగా 941 చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఇందుకోసం రూ.365.31 కోట్లు కేటాయించారు. పూడికతీతతో వర్షపు నీటి వృథాను నిలువరించడంతో పాటు చెరువుల నీటి నిల్వ సామ ర్థ్యం పెరిగింది.సీఎం కేసీఆర్ చొరవతో తటాకాలన్నీ మరమ్మ తు కు నోచుకోవడంతో రైతుకు సాగునీటి గోస తీరింది.
గోదావరి పరవళ్లు..
తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో భారీ వానలతో గోదావరి నది ఉరకలేస్తున్నది. ఎగువన ప్రాజెక్టులు నిండడంతో రోజురోజుకూ జీవనది ప్రవాహం పెరుగుతున్నది. మంజీరలోనూ వరద ప్రవాహం కనిపిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. గతేడాది మాదిరిగానే నిజాంసాగర్లోకి వరద వస్తుండడంతో ఆయకట్టు రైతుల్లో రెట్టింపు ఆనందం కలుగుతున్నది. ఐదారేండ్ల అనంతరం 2020 వానకాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో సుమారు 7టీఎంసీల నీరు నిల్వ ఉంది. వానలు ఇదే స్థాయిలో కురిస్తే ఈసారి కూడా చారిత్రక ప్రాజెక్టు ఉప్పొంగే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటితో ఆయకట్టు ప్రాంత రైతుల సాగుకు ఢోకా లేకుండా పోయింది. దీనికి తోడుగా ఇప్పటికే పోచంపాడ్ ప్రాజెక్టు నిండుకుండలా దర్శనం ఇస్తున్నది.
90టీఎంసీల సామర్థ్యం గల ఎస్సారెస్పీలో ప్రస్తుతం 65.910 టీఎంసీల నీరు వచ్చి చేరింది. జూన్ మొదటి వారం నాటికి ఎస్సారెస్పీలో కేవలం 22 టీఎంసీల నీరుండగా నెలన్నర రోజుల్లో దాదాపు 43టీఎంసీల మేర వరద వచ్చింది.
అప్రమత్తంగా ఉన్నాం…
వానకాలం ప్రారంభం నుంచే జలవనరుల శాఖ అప్రమత్తంగా ఉంది. మా పరిధిలోని అన్ని తటాకాల వద్ద సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భారీ వానలతో చెరువుల వద్ద తూములు, కట్టలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నాం. ప్రమాద స్థాయికి నీటి నిల్వలు చేరితే వెనువెంటనే సమాచారం తెప్పించుకుని తదుపరి చర్యలు తీసుకుంటాం. మిషన్ కాకతీయ పథకంతో చెరువులు బాగు పడ్డాయి. కట్టలు బలోపేతం కావడం ద్వారా ప్రమాదాలేవీ ఎక్కడా కనిపించడం లేదు.