వరి సాగులో సరికొత్త మార్పు..
వెదజల్లే పద్ధతిలో వరి సేద్యానికి వ్యవసాయశాఖ ప్రోత్సాహం
గణనీయంగా తగ్గనున్న కూలీరేట్లు..పెరుగనున్న దిగుబడులు
సీఎం కేసీఆర్ స్వీయానుభవం స్ఫూర్తితో..
బోధన్, జూలై 15: గత ఏడాది సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు నిర్ణీత సాగువిధానాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసిన వ్యవసాయశాఖ.. ఈ ఏడాది వానకాలం పంటల సాగులో సరికొత్త విధానాల వైపు రైతులు మొగ్గుచూపేలా దృష్టిని సారించింది. ఇందులో భాగంగానే ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు సేంద్రియ ఎరువుల ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది వానకాలం పంటల మార్పిడితో పాటు విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేసేలా వ్యవసాయశాఖ ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. మొదట మండలానికి కనీసం 50 ఎకరాల్లో విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరి పంటను సాగుచేసేలా చూస్తున్నారు. దీంతో రానున్న కాలంలో రైతుల్లో ఈ పద్ధతిపై ఉన్న అపోహాలు తొలగిపోతాయని, దీంతో పెద్ద సంఖ్యలో వెదజల్లే పద్ధతిలోనే వరి సేద్యం జరుగుతుందని భావిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం వరి నాట్లు జోరందుకోవడంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మొదటినుంచీ జిల్లాలోవ్యవసాయపనులకు కూలీ రేట్లు ఎక్కువే. దీనికితోడు ప్రస్తుతం ఒక్కసారిగా వరి నాట్లు జోరందుకోవడంతో కూలీరేట్లు అమాంతం పెరిగిపోయాయి. వరి నాటు విధానంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నేలలో విత్తనాలను వెదజల్లే పద్ధతిలో రైతులు వరిని సాగుచేసినట్లయితే, ఈ కూలీరేట్ల ఇబ్బంది ఉండదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఎకరానికి ఒక్క నాట్ల రూపంలో అయ్యే ఖర్చు రూ.6000 నుంచి రూ.8,000 వరకు రైతులకు మిగులుతాయి. వెదజల్లే పద్ధతిలో తక్కువ మోతాదులో విత్తనాలు అవసరమవుతాయి. కలుపు తీయడం, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గుతుంది. దీంతో ఎకరానికి రూ.8,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చులు తగ్గుతాయి. ఇలా రైతుకు ఎంతో మేలు జరుగుతుంది.
వెదజల్లే పద్ధతిలో వరి సాగు ఇలా..
వరి సాగులో అత్యంత కీలకంగా ‘నాటు వేయడం’ ప్రక్రియనే రైతులు అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఇది వ్యయప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. అధిక పెట్టుబడులు అవసరమవుతాయి. ఈ ఇబ్బందులను అధిగమించి రైతుకు పెట్టుబడుల ఖర్చులను తగ్గించేందుకు వచ్చిందే. ఈ వెదజల్లే పద్ధతి. ఈ విధానంలో నారుమడి అవసరం ఉండదు. వరి విత్తనాలను నానబెట్టి, అవి మొలకెత్తే దశలో ఉన్నప్పుడు మడుల్లో వెదజల్లాల్సి ఉంటుంది. నారుమడికి ఎలాగైతే విత్తనాలు వేసుకుంటామో.. అదే పద్ధతిలో పలుచగా విత్తనాలను చల్లుకోవాలి. వానకాలంలో కురిసే సాధారణ వర్షాలు ఈ పంటకు సరిపోతాయి. ఈ విధానంలో ఎరువుల వాడకం తక్కువే. విత్తనాలు చల్లిన తర్వాత 15 రోజులకు డీఏపీ వేయాలి. 20 నుంచి 2 రోజుల మధ్యలో కలుపు నివారణ మందులు వేసుకోవచ్చు. నాటువేసే పద్ధతిలో మొక్కకు 15 నుంచి 20 పిలకలు వస్తే.. వెద పద్ధతిలో 25 నుంచి 30 పిలకలు వస్తాయి. దీంతో దిగుబడి పెరుగుతుంది. సాధారణ పద్ధతిలో కన్నా పంట కాలం కూడా తగ్గుతుంది. వెద పద్ధతిలో విత్తనాల మోతాదు తగ్గుతుంది. సంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 30 నుంచి 35 కిలోల విత్తనాలు అవసరం. ఈ పద్ధతిలోనైతే ఎకరానికి 14 నుంచి 15 కిలోల విత్తనాలు సరిపోతాయి. అంటే విత్తనాలకయ్యే ఖర్చు సగానికి సగం తగ్గిపోతుందన్నమాట.. ఇలా పెట్టుబడులు తగ్గడం, దిగుబడులు పెరుగడం, అన్నింటికీ మించి చీడపీడల బెడద తగ్గడం.. వెద పద్ధతి సాగుతో రైతుకు లాభం చేకూరుతుంది.
సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో..
జూన్ మొదటివారంలో సీఎం కేసీఆర్ వానకాలం పంటలపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో వరి సాగులో వెద పద్ధతి ప్రస్తావనకు వచ్చింది. స్వయంగా సీఎం కేసీఆర్ ఈ విధానంతో కలిగే ప్రయోజనాలను ప్రస్తావించి, ఇకనుంచి నాటువేసే పద్ధతికి చెక్పెట్టే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. తాను కూడా వెదజల్లే పద్ధతిలో తన సొంత వ్యవసాయక్షేత్రంలో వరిని పండించానని, మంచి దిగుబడులు వచ్చాయని చెప్పి వ్యవసాయశాఖలో ఈ విధానంపై స్ఫూర్తిని నింపారు.
ఈ ఫొటోలో ఉన్న రైతు పల్లెంపాటి రఘురాం ప్రసాద్. బోధన్ మండలం భవానీపేట్ గ్రామం. ఆదర్శ రైతుగా గతంలో అనేకసార్లు ప్రశంసలు అందుకున్న ఆయన.. మూడేండ్లు గా వెదజల్లే పద్ధతిలో వరి పంటను పండిస్తున్నారు. 20 ఎకరాల్లో ఇదే విధానంలో వరి పంటను పండిస్తూ అధిక దిగుబడులను సాధించారు. జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రఘురాం ప్రసాద్ సాగుచేస్తున్న వరి పంట క్షేత్రాలను సందర్శించి.. వెద పద్ధతిలో వరి సేద్యం లాభదాయకంగా మారిన తీరును తెలుసుకున్నారు. ఈ విధానంలో ఎంతో అనుభవం గడించిన రఘురాం ప్రసాద్ ప్రస్తుతం జిల్లాలోని అనేక మంది రైతులకు ఈ పద్ధతిపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు.