బీబీపేట్, జూలై 20:వాడవాడలా అద్దాల్లాంటి రోడ్లు.. శుభ్రమైన డ్రైనేజీలు.. రహదారుల పక్కన, ఇండ్ల ముంగిట ఏపుగా పెరిగిన మొక్కలతో హరిత సొబగులు అద్దుకున్నది కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని మల్కాపూర్ గ్రామం. తీరొక్క మొక్కలతో పల్లె ప్రకృతి వనం ముచ్చటగొలుపుతుండగా, నిత్య పారిశుద్ధ్య కార్యక్రమాలతో స్వచ్ఛ గ్రామంగా రూపుదిద్దుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న మల్కాపూర్ గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులతో ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
ఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రకృతివనం
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో గ్రామం పచ్చదనంతో విలసిల్లుతున్నది. పల్లె ప్రకృతి వనంలో పెరిగిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలోని ప్రధానరోడ్డుతోపాటు కాలనీల్లోని అంతర్గత రోడ్లకిరువైపులా మొక్కలను నాటడంతో వీధులన్నీ హరితశోభను సంతరించుకున్నాయి.
కంపోస్ట్ షెడ్డులో ఎరువుల తయారీ
ప్రతి రోజూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటా తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్ షెడ్డుకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు.
పారిశుద్ధ్య పనుల నిర్వహణ
పల్లె ప్రగతి అమలులోకి వచ్చాక పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు డ్రైనేజీల్లోని పూడికను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. పిచ్చిమొక్కల తొలగింపు, మురికి కాలువలు, పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తుండడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గింది. కాలనీల రోడ్లను శుభ్రంగా ఉంచుతుండడంతో అద్దాల్లా మెరుస్తున్నాయి.
వైకుంఠధామంలో సకల వసతులు
గతంలో శ్మశానవాటిక లేకపోవడంతో దహన సంస్కారాలు చేసేందుకు వచ్చిన వారు నానా ఇబ్బందులు పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.12 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. దహన వాటికలు, కార్యాలయ గది, మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించి రంగులతో తీర్చిదిద్దారు. వైకుంఠధామం ప్రాంగణంలో సుందరీకరణ పనులు చేసిన ఫలితంగా మండలంలోనే ఆదర్శంగా నిలిచింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వైకుంఠధామం నిర్మాణ తీరుపై సర్పంచ్ రాంరెడ్డి, పాలకవర్గ సభ్యులను అభినందించారు.
అభివృద్ధిలో ఆదర్శం
పల్లె ప్రగతి కార్యక్రమం మల్కాపూర్కు వరంలా మారింది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, కోతులకు ఆహార శాల, కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, మురుగు కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులతో గ్రామం సర్వాంగసుందరంగా తయారైంది.
పల్లె ప్రగతి గ్రామానికి వరం
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం మా గ్రామానికి వరంలా మారింది. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తొలగిపోయాయి. అందరి సహకారంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సంవత్సరం క్రితం ఉత్తమ జీపీగా ఎంపికై రూ.20 వేల నగదు ప్రోత్సాహం అందుకున్నాం.
-వలిపి రాంరెడ్డి, సర్పంచ్, మల్కాపూర్
గ్రామ రూపురేఖలు మారాయి
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగం గా చేపట్టిన అభివృద్ధి పనులతో మా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. రోడ్లన్నీ శుభ్రంగా కనిపిస్తున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన విలేజ్ పార్కు యువకులకు, చిన్న పిల్లలకు ఉపయోగపడుతున్నది.
-రమేశ్కుమార్, గ్రామస్తుడు, మల్కాపూర్