మెండోరా, జూలై 16: ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుండడంతో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ఎగువ మహారాష్ట్రతోపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి వరదలతో ప్రాజెక్టులో నీటిమట్టం శుక్రవారం సాయంత్రం వరకు 1085.50 అడుగుల వద్దకు చేరుకున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గిందని, కేవలం 9,873 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. గురువారం రాత్రి 9గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు సుమారు అడుగు నీటిమట్టం పెరిగిందన్నారు. ఈ సీజన్లో ప్రాజెక్ట్లోకి 53 టీఎంసీల వరద వచ్చినట్లు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎస్కేప్గేట్ల ద్వారా గోదావరిలోకి 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ కోసం 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారని తెలిపారు. గుత్ప ఎత్తి పోతలకు 135 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1085.50 అడుగుల (68.433 టీఎంసీలు) వద్ద ఉన్నదని వివరించారు.