వానకాలం పంటల సీజన్ ఆశాజనకంగా ప్రారంభమైంది. జూన్ నెల ఆరంభంతోనే వానలు మొదలవ్వడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. జూన్, జూలై నెలల్లో ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం అత్యధికంగా నమోదైంది. గతంలో జూన్, జూలై నెలల్లో అధిక వర్షపాతం నమోదైన మండలాలు కనిపించలేదు. 2021 వానకాలంలో సీజన్ ప్రారంభంతోనే దంచి కొట్టిన వానలతో ఊరూరా వరద నీటి నిల్వలు అమాంతం పెరిగాయి. ఇప్పటికే సగం నీళ్లతో ఉన్నచెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. మరికొద్ది రోజులు భారీ వానలు కురిస్తే అనేక చెరువులు మత్తడి దుంకే అవకాశం లేకపోలేదు. నిజామాబాద్ జిల్లాలో రెండు మండలాలు మినహా 27 మండలాల్లో సాధారణ వర్షపాతానికి మించి వానలు కురిశాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
రూరల్, ధర్పల్లిలో లోటు వర్షపాతం..
నిజామాబాద్ జిల్లాలో సీజన్ ప్రారంభంతోనే భారీ వానలు అనుకూలిస్తున్నాయి. మొత్తం 29 మండలాలకు గాను నేటి(బుధవారం) వరకు 27 మండలాల్లో అత్యధిక వర్షపాతం రికార్డు అయ్యింది. నిజామాబాద్ రూరల్, ధర్పల్లి మండలాల్లోనే అత్యల్పంగా నమోదైంది. వర్షపాతం లెక్కల ప్రకారం బుధవారం ఒక్కరోజే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్త్తరు నుంచి భారీ వానలు కురిశాయి. అత్యధికంగా కోటగిరిలో 6.9సెం.మీటర్లు, వర్నిలో 6.4 సెం.మీ, రెంజల్లో 6.1 సెం.మీ, బోధన్, మెండోరాలో 5.5సెం.మీ చొప్పున కురిసిం ది. అత్యల్పంగా ఇందల్వాయిలో 3 మిల్లీ మీటర్లు, సిరికొండలో 1సెం.మీ, ధర్పల్లిలో 1.2సెం.మీ వాన పడినట్లుగా గణాంకాలు వెల్లడించాయి. జిల్లా వార్షిక సగటు వర్షపాతం 30229 మిల్లీమీటర్లు కాగా జూన్, జూలైలో నమోదైన వర్షపాతం 13159 మిల్లీమీటర్లుగా ఉంది. వానకాలం సీజన్లో మొత్తం సాధారణ వర్షాపాతం 8350 మిల్లీ మీటర్లుండగా 13159 మిల్లీమీటర్లుగా నమోదై 57శాతం మేర అత్యధిక వర్షం కురిసింది. నిజామాబాద్ రూరల్, ధర్పల్లి మండలాల్లో తప్పా మిగిలిన అన్ని మండలాల్లోనూ రికార్డు స్థాయిలో వర్షం కురిసింది.
కామారెడ్డిలో అధికం..
కామారెడ్డి జిల్లాలో నెలన్నర రోజుల్లో భారీగా వానలు కురిశాయి. సరిగ్గా ఏడాది కిందట సగానికి ఎక్కువ మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా ఇప్పుడు లోటు అన్నదే లేకుండా పోయింది. వర్షపాతం గణాంకాల ప్రకారం బుధవారం ఒక్కరోజే నాగిరెడ్డిపేటలో అత్యధికంగా 12.16 సెం టీ మీటర్లు, బిచ్కుందలో 12సెం.మీ, జుక్కల్లో 11.15 సెం.మీ మేర వాన కురిసింది. పిట్లంలో 8.8 సెం.మీ, బాన్సువాడలో 8సెం.మీ, నిజాంసాగర్లో 7సెం.మీటర్ల వాన కురవగా.. అత్యల్పంగా మాచారెడ్డిలో 01 మిల్లీమీటర్లు, దోమకొండ, తాడ్వాయిలో 3మిల్లీమీటర్ల వాన కురిసింది. జిల్లా వార్షిక సగటు వర్షపాతం 17690 మిల్లీమీటర్లు కాగా జూన్, జూలై నెలల్లో ఇప్పటికే 8526 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్ ఒకటో తేదీ నుంచి నేటి వరకు సాధారణ వర్షపాతం 4387 మి.మీటర్లు కాగా 8526 మి.మీటర్లతో డబుల్ రెట్లు వాన కురవడం విశేషం. 22 మండలాల్లోనూ ఎక్కడా లోటు వర్షపాతం నమోదు కాకపోవడం రికార్డుగా మారింది.
జూన్, జూలై నెలలు కీలకం..
కొన్నేళ్లుగా జూన్, జూలై నెలాఖరు వరకు కరువు కాలం కండ్ల ముందు కనిపించేది. సమయానికి వానలు కురవకపోవడంతో ఎక్కడ చూసినా బీడు భూములే దర్శనమిచ్చేవి. కానీ, ఇప్పుడు ఇదే సమయానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రికార్డు స్థాయిలో వానకురిసింది. లోటు వర్షపాతం ఉండే మండలాల్లోనూ అత్యధికం కనిపిస్తున్నది. పంట కాలం ప్రారంభమైన నెల రోజుల నుంచి వానలు కురుస్తుండడంతో రైతులు సంబురం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల వానకాలం సీజన్లో తొలి రెండు నెలలే కీలకం. ఈ సీజన్లో ఇప్పటి వరకు వర్షం భారీగానే కురిసింది. చిరుజల్లుల నుంచి భారీ వానలతో నేల తడిసి ముద్దయ్యింది. పంట కాలం 45 రోజులకు చేరుతున్నది. వివిధ పంటల సాగు సైతం పెరుగుతున్నది. వర్షపాతం లోటును అధిగమించి అత్యధిక స్థాయికి చేరుతుంది. వానకాలం పంటల సాగుకు వారం క్రితం నుంచే నిజాంసాగర్ ప్రాజెక్టు, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల నుంచి నీటిని వదిలారు. వానలు జోరందుకోవడంతో జల వనరుల శాఖ అధికారులు వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్లో నీళ్లను ఎత్తిపోయడాన్ని నిలిపేశారు. సహజ సిద్ధంగానే నీటి వసతి అంతటా ఏర్పడడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నీటి వృథాను, ఖర్చును దృష్టిలో పెట్టుకొని జల వనరుల శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రైతుల అవసరాలు తీర్చేందుకు పని చేస్తున్నారు.
ఫిర్యాదులకు కంట్రోల్ రూం
ఇందూరు/ ఆర్మూర్, జూలై 14: మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఫిర్యాదులను స్వీకరించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. వర్షాలతో ఇబ్బందులు ఏర్పడినా, ప్రమాదాలు చోటు చేసుకున్నా ప్రజలు, అధికారులు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08462-220183కి కాల్ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. కాల్సెంటర్ 24 గంటలపాటు పని చేస్తుందని, వచ్చిన ఫిర్యాదులను నమోదు చేయడంతోపాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు సూచించారు.
ఆర్మూర్లోనూ..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్, కోటార్మూర్ ప్రజలకు అత్యవసర సేవలందించేందుకు మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితాపవన్, మున్సిపల్ కమిషనర్ ఎ.జగదీశ్వర్గౌడ్ తెలిపారు. వరదలు, భవనాలు కూలిపోవడం తదితర సమస్యలపై కంట్రోల్ రూమ్ 9550904946, 9959749023 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.