నిజామాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ పరిపాలనలో భూముల విలువ అమాంతం పెరిగింది. సాగు నీరు అందుబాటులోకి తేవడంతో రూ.10లక్షల్లోపు పలికిన ఎకరం వ్యవసాయ భూమి ఇప్పుడు రెండు నుంచి మూడు రెట్లు పెరిగింది. మార్కెట్లో వ్యవసాయ భూములకు తోడుగా వ్యవసాయేతర భూముల విలువ సైతం భారీగా పెరిగింది. మార్కెట్ ధరలకు రెక్కలు వచ్చినప్పటికీ ప్రభు త్వం నిర్ణయించిన ధరల్లో మాత్రం తేడా అలాగే కొనసాగుతూ వచ్చింది. జిల్లాల పునర్విభజన, నూతన గ్రామ పంచాయతీలు, మండలాల ఏర్పాటుతోనూ గ్రామ స్థాయిలో భూముల ధరలు అమాంతం ఎగబాకాయి. ఈ పరిస్థితుల్లో భూముల విలువను క్రమబద్ధీకరించేందుకు ఈ మధ్య సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తాజా మార్కెట్ విలువను అనుసరించి భూముల విలువను, రిజిస్ట్రేషన్ రుసుములో మార్పులు, చేర్పులు చేయాలని మంత్రి మండలి నిశ్చయించడంతో ప్రభుత్వంకొద్ది రోజులుగా తీవ్ర కసరత్తు చేసింది. తాజాగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు మూడు స్లాబుల్లో వివి ధ స్థాయిలో విలువను పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రిజిస్ట్రేషన్ రుసుములోనూ మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ ప్రక్రి య అంతా గురువారం నుంచే అమల్లోకి రానున్నదని సర్కారు చెప్పడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఈ మేరకు పెరిగిన భూములు విలువ ప్రకారం రిజిస్ట్రేషన్లు చేసేందుకు సిద్ధమవుతున్నది.
పెరగనున్న ఆదాయం…
భూముల విలువ పెంచడంతో స్టాంప్ డ్యూటీ పెరిగి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 6శాతం ఆదాయం వస్తున్నది. సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో భూములు, ఇండ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంపు డ్యూటీ 4శాతం ఉండగా ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5శాతంగా ఉంది. మొత్తం 6శాతం ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఇకపై ఈ మొత్తం ఛార్జీలు 7.5 శాతానికి చేరుకోనున్నది. వ్యవసాయ భూముల కనిష్ఠ మార్కె ట్ విలువ ఎకరాకు రూ.75వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. స్లా బులు వారీగా 50శాతం, 40శాతం, 30శాతం లెక్కన మూడు స్లాబుల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను పెంచినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా ఓపెన్ ప్లాట్ల చదర పు గజం కనీస ధర రూ.100 నుంచి రూ.200లకు సర్కారు పెం చింది. స్లాబులు వారీగా 50శాతం, 40శాతం, 30శాతం లెక్కన మూడు స్లాబుల్లో ప్లాట్ల మార్కెట్ విలువలను పెంచారు. అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ రూ.800 నుంచి రూ.1000కి సర్కారు పెంచింది. చదరపు అడుగుపై 20శాతం, 30శాతం లెక్కన పెంచినట్లుగా సర్కారు వివరించింది.
రేపటి నుంచే అమల్లోకి…
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుము పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మార్కెట్ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం ఈ మధ్యే నిర్ణయించింది. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడేండ్లకు భూముల విలువలను సవరించారు. ఈ కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. రాష్ట్ర ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. సాగు నీటి వసతి విస్తరించడంతో భూముల విలువ భారీగా పెరిగింది. ఐటీ, ఔషధ, పర్యాటకం, రియల్ ఎస్టేట్ రం గాల్లో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్డు వివిధ రంగాల్లో అభివృద్ధి నేపథ్యంలో భూముల మార్కెట్ విలువలు సవరించాల్సిన అవసరం ఏర్పడింది.
తేడాలను సమం చేసిన ప్రభుత్వం…
ఇండ్ల స్థలాలు, ప్లాట్లు బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండగా, ప్రభుత్వ రికార్డుల్లో వాటి విలువ చాలా తక్కువగా ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వానికి వాస్తవంగా రావాల్సిన ఆదాయం రావడం లేదు. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్, వినాయక్నగర్ ప్రాంతంలో బహిరంగ మార్కెట్లో చదరపు గజం స్థలం విలువ రూ.20వేలు నుంచి రూ.50 వేలు వరకు ధర పలుకుతున్నది. కానీ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల ప్రకారం ఇదే ప్రాంతంలో చదరపు గజం స్థలం విలువ బహిరంగ మార్కెట్ విలువతో పోలిస్తే సగం మాత్రమే ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసిన వ్యక్తి ప్రభుత్వ ధర ప్రకారం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నందున ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు రూపం లో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోతున్నది. బహిరంగ మార్కెట్లో ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రికార్డుల్లో ధరలు నమోదు చేయడం ద్వారా ఇండ్ల స్థలాలు కొనుగోలులో సామాన్య ప్రజలు ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుందని కొంత కాలంగా ప్రభుత్వం భూముల విలువల పెంపును వాయిదా వేస్తూ వచ్చింది.
స్వరాష్ట్ర పరిపాలనలో వచ్చిన పెను మార్పులు మూలంగా రోజురోజుకూ ధరలు పెరుగుతూనే ఉండడంతో సర్కారు సవరణకు మొగ్గు చూపింది. బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ ధరలను క్రమబద్ధీకరించింది. నిజామాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వ్యవసాయ భూములపై నెలకు సుమారుగా రూ.4కోట్లు, వ్యవసాయేతర భూముల ద్వారా దాదాపు 10కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నది. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములపై సుమారు రూ.2కోట్లు, వ్యవసాయేతర భూముల ద్వారా రూ.5.5 కోట్లు వరకు ఆదాయం వస్తున్నట్లుగా అంచనా ఉంది. భూముల విలువ సవరణ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుతో ఆదాయం మరింతగా పెరగనుంది.