వేల్పూర్, జూలై 12: సోషల్ మీడియాలో అబద్ధాలే బీజేపీ విధానమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. అబద్ధ ప్రచారాలు చేస్తూ యువకులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని మండిపడ్డారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బీజేపీ జిల్లా కార్యదర్శి హరీశ్, వార్డు సభ్యుడు రాజేశ్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది యువకులు మంత్రి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను యువకులు, ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఆ పార్టీ నాయకులు వారి స్థాయికి మించి సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు వాజ్పేయి, అద్వానీ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేశారని అన్నారు.
వారంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న నాయకులు విలువలు లేనివారని, నోటికి వచ్చినట్లు అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు విప్పితే చాలు అన్నీ అసత్యాలే అన్నారు. తాను బాల్కొండ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తానని తెలిపారు. తాను నియోజకవర్గ అభివృద్ధి తప్ప, సోషల్ మీడియాలో ప్రచారాలను పట్టించుకోనని అన్నారు. యువత సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలను గ్రహించాలని కోరారు. బండి సంజయ్, అర్వింద్, రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తాను నియోజకవర్గంలో 31 ఆలయాలు కట్టించానని, ఎంపీ అర్వింద్ ఒక్క మందిరమైనా కట్టించాడా అని ప్రశ్నించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని పేర్కొన్నారు.
అబద్ధాలు ఆడడంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ కూడా ముందువరుసలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పరిపాలించే రాష్ర్టాల్లో ఎందుకులేవని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ బద్దం ప్రవీణ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, ఎంపీపీ లావణ్య, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, గ్రామ సర్పంచ్ బూస సునీత, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, ఎంపీటీసీ కన్న లింగవ్వ, వేల్పూర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్, డాక్టర్ ప్రసాద్, రియాజ్ అలీతోపారం గంగాధర్,అబ్దుల్ ఖాజీమ్, కిట్టు, చక్రి తదితరులు పాల్గొన్నారు.