ఆర్మూర్, జూలై 18:పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా.. మానవ జీవితం అల్లకల్లోలం కాకుండా.. రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణాన్ని పచ్చని తోరణంలా మార్చింది. పట్టణమంతా ఆకుపచ్చరంగు పరుచుకునేలా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తున్నది. పట్టణంలోని రోడ్లన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
భావితరాలకు మంచి వాతావరణం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఆర్మూర్ పట్టణాన్ని హరితమయంగా మారుస్తున్నది. పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ పచ్చని మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన నవనాథసిద్ధుల గుట్టకు వెళ్లే దారిలో సైతం రకరకాల మొక్కలను నాటుతూ భక్తులను ఆకట్టుకునేలా రూపుదిద్దుతున్నారు. ఆర్మూర్ పట్టణం మనస్సుకు హాయిగొల్పే చెట్లతో ఉద్యానవనంగా తయారై గ్రీన్ సిటీగా రూపుదిద్దుకుంటున్నది. ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్, కోటార్మూర్లోని ప్రధాన రోడ్లన్నీ మొక్కలతో ఆహ్లాదకరంగా మారాయి.
యజ్ఞంలా హరితహారం..
ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను 100 శాతం బతికించాలన్న లక్ష్యంతో మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ ఏడాది పట్టణంలో 2,95,625 మొక్కలను నాటాలని నిర్ణయించుకొని ఆ దిశగా పనులు కొనసాగిస్తున్నారు. ఈ నెల 1 నుంచి 10వతేదీ వరకు నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితాపవన్, వైస్ చైర్మన్ షేక్మున్నా, కమిషనర్ జగదీశ్వర్గౌడ్, కౌన్సిలర్లు, అధికారులంతా కలిసి ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేస్తూ నాటేలా చర్యలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతుండడంతో ఆర్మూర్ పట్టణం ప్రకృతి రమణీయతను సంతరించుకుంటున్నది. నాటిన మొక్కలను రక్షించడానికి ప్రత్యేక అధికార బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు.
వందశాతం మొక్కలు బతికేలా..
గతేడాది హరితహారంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో 4 లక్షల 37 వేల 200 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని 3లక్షల 6వేల 8 మొక్కలను అధికారులు, ప్రజాప్రతినిధులు నాటించారు. నాటిన మొక్కల్లో 80 శాతం మొక్కలను అధికారులు సంరక్షించారు. కాగా ఈ ఏడాది 2లక్షల 95 వేల 625 మొక్కలను నాటాలని నిర్ణయించుకొని 15 రోజులుగా మొక్కలు నాటించే కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నారు. ఇప్పటికే లక్షా 50వేల పైచిలుకు మొక్కలను ఆర్మూర్ పట్టణంతోపాటు విలీనమైన మామిడిపల్లి, పెర్కిట్, కోటార్మూర్లోని ఖాళీ స్థలాలను గుర్తించి నాటారు. వీటితోపాటు అవెన్యూ ప్లాంటేషన్, డివైడర్ల మధ్యలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, లేఅవుట్లు లేని 10శాతం స్థలాలు, ప్రజల ఇంటి ఆవరణల్లో మొక్కలను నాటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేకమైన మొక్కలు..
హరితహారం, పట్టణ ప్రగతిలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో వివిధ రకాల మొక్కలను నాటేందుకు మున్సిపల్ పాలకవర్గం శ్రద్ధ వహించింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించడంతోపాటు గ్రీన్ సిటీగా మార్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి మొక్కలను తెప్పిస్తున్నారు. మహాగని, గుల్మోహర్, ఫెల్టోఫామ్, బోగెన్విలియా, మిల్లింగ్టావియా, టబుబియా, రోజియా, అవలాండ, టర్మినాలియా, మెంటాలియా తదితర రకాల మొక్కలను మున్సిపల్ పరిధిలో నాటుతూ పట్టణాన్ని హరిత తోరణంలా మారుస్తున్నారు.
మొక్కలను సంరక్షించాలి
పట్టణంలో ఈ సంవత్సరం సుమారు 3 లక్షల మొక్కలను నాటించి హరిత ఆర్మూర్గా తీర్చిదిద్దాలని మున్సిపల్ పాలకవర్గం, అధికారులతో తీవ్ర కసరత్తు చేయిస్తున్నా. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ఇదివరకే జోరుగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను ప్రజలు తీసుకున్నారు. ఇదివరకు నాటిన, ఇకపై నాటనున్న మొక్కలను ప్రతిఒక్కరూ సంరక్షించాలి. నేడు నాటిన మొక్కనే భవిష్యత్తు తరాలకు మనుగడనిస్తాయి.
ప్రతిఒక్కరూ మొక్కలు పెంచాలి
జీవకోటికి ఆధారమైన మొక్కలను ప్రతిఒక్కరూ పెంచాలి. ప్రస్తుతం నాటే మొక్కలే భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందిస్తాయి. ఆర్మూర్ పట్టణంలోని ప్రజలందరూ ఇంటి ఆవరణ, ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలి.
హరిత ఆర్మూరే లక్ష్యం..
ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి చొరవతో హరిత ఆర్మూర్గా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాము. పట్టణంలో అనువైన స్థలాలను గుర్తించి మొక్కలు నాటించాం. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే ఉద్దేశంతో ఆర్మూర్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అవెన్యూ ప్లాంటేషన్, డివైడర్ల మధ్యలో, ప్రజల ఇంటి ఆవరణలో మొక్కలను నాటించి ఆర్మూర్ను హరితవనంలా తీర్చిదిద్దుతాం. హరితహారం లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేస్తాం.
-పండిత్ వినితాపవన్, మున్సిపల్ చైర్పర్సన్, ఆర్మూర్