నిజామాబాద్, సెప్టెంబర్ 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల బలోపేతానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా కృషి చేస్తున్నారు. పరిపాలనలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు మేలు జరిగే విధంగా తనదైన రీతిలో ప్రయత్నం మొదలు పెట్టారు. వారి సమస్యలను శాసనమండలి వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కవిత రోడ్డెక్కి పోరాటం చేశారు. అక్రమ నిర్బంధాలను, కేసులను ఎదుర్కొన్నారు. కీలకమైన ఉద్యమ ఘట్టాల్లో క్రియాశీలకంగా పాల్గొని ప్రజలను చైతన్య పరిచారు. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజలను జాగృతం చేశారు. తన వాగ్దాటితో సమైక్య పాలకులను తూర్పారబట్టారు. స్వరాష్ట్రంలో తొలి మహిళా ఎంపీగా ఎన్నికైన తర్వాత సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారు. కొత్త రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చే దిశలో పయనించారు. తనదైన వాగ్దాటితో దేశ రాజధానిలో మేధావులతో ప్రశంసలు దక్కించుకున్నారు. లోక్సభ సభ్యురాలిగా జాతీయ స్థాయి అంశాలను ప్రస్తావించి ఎంతో మందిని ఆకట్టుకున్నారు. కశ్మీర్ పండిట్ అంశం నుంచి మహిళల సమస్యల వరకు గళం విప్పి దటీజ్ కవిత అన్నట్లుగా నిలిచారు. 2020లో శాసనమండలికి ఎన్నికైన కవిత తొలిసారిగా సభలో తనదైన శైలిలో ప్రసంగించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మేలు కోసం ప్రాధాన్యతమైన విషయాలపై మాట్లాడారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ వచ్చిన నాటి నుంచి ఏ ఒక్కరూ లేవనెత్తని అంశాన్ని తొలి ప్రసంగంలోనే కవిత ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లతో శభాష్ అనిపించుకుంటున్నారు.
గ్రామ స్థాయిలో పరిపాలనా వ్యవస్థ…
గ్రామీణ ప్రాంతాల స్వపరిపాలన వ్యవస్థలో కింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండోది మండల ప్రజా పరిషత్లు. ఈ వ్యవస్థలో ఎంపీటీసీ, ఎంపీపీలు కీలకం. వీరితో పాటు జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ స్థానం సభ్యుడు(జడ్పీటీసీ) సైతం ముఖ్య పాత్ర వహిస్తుంటారు. వీరంతా రెండున్నర దశాబ్దాలుగా ఉత్సవ విగ్రహాలుగా కొనసాగుతుండగా వీరి బాధలను ఆలకించిన నాథుడే ఇన్ని రోజుల పాటు కనిపించలేదు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో శాసన మండలికి ఎన్నికైన కవిత తన తొలి ప్రసంగంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ ఆత్మగౌరవ సమస్యలను సభలో ప్రస్తావించారు. దీంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కవిత తీసుకున్న చొరవను అభినందిస్తున్నారు.
స్వరాష్ట్రంలో పెరిగిన ప్రాధాన్యం
వనరుల పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చడం, ప్రభుత్వ పను ల్లో స్థానికులను భాగస్వామ్యం చేయడం, గ్రామీణ ప్రజల దైనందిన అవసరాలను మేలైన పద్ధతిలో తీర్చడం కోసం పంచాయతీరాజ్ వ్యవస్థ పురుడు పోసుకుంది. స్వావలంబన, స్వీయ చొరవతో గ్రామీణ సమాజ రూపురేఖలు మార్చడానికి దేశంలో మూడంచెల పరిపాలన వ్యవస్థను తీసుకువచ్చారు. బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న ప్రాచీన పాలనా వ్యవస్థకు కొంగొత్త రూపాన్ని తొడిగి జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పరిపాలనను 73వ రాజ్యాంగ సవరణతో ఉమ్మడి రాష్ట్రంలో 1994 నుంచి అమల్లోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా సగానికి ఎక్కువ రాష్ర్టాలు.. మూడు అంచెల విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో పంచాయతీ వ్యవస్థను పాలకులు నిర్వీర్యం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పంచాయతీ వ్యవస్థకు సీఎం కేసీఆర్ ప్రాణం పోశారు. నిధులు పుష్కలంగా అందించడంతో పాటు నూతన చట్టాన్ని తీసుకు వచ్చి అధికారాలు కల్పించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను పవర్ ఫుల్ వ్యక్తులుగా మలిచారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
దిక్సూచిలా కవిత
లోక్సభ సభ్యురాలిగా కవిత విశిష్ట సేవలందించారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి దేశ ప్రధానితో సహా కేంద్ర మంత్రులను అనేక అంశాలపై ఒప్పించి ప్రజలకు మేలు చేకూర్చారు. పెద్దపల్లి – నిజామాబాద్ రైల్వే లైన్, పసుపు బోర్డు అంశం, గల్ఫ్ సమస్య, మహిళలపై దాడుల నిరోధం, కశ్మీర్ పండిట్ అంశాలతోపాటు తెలంగాణ నీటి అంశాలు, ఇతరత్రా విభజన సమస్యలను ప్రస్తావించి దేశ ప్రజల ముంగిట చర్చకు వచ్చేలా కృషి చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు శాసన మండలిలో ప్రతినిధిగా ఉన్న కవిత ఆ వర్గానికి మేలు చేకూర్చేందుకు ముందడుగు వేశారు. ప్రభుత్వం ద్వారా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు మేలు జరిగే విధంగా తనదైన రీతిలో ప్రయత్నం మొదలు పెట్టారు. మండలిలో తన మొదటి ప్రసంగంలోనే నూతన మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాల కొరతను, గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీలకు దక్కాల్సిన గౌరవాన్ని, ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక ప్రజా ప్రతినిధులకు జెండా వందనం చేసే అవకాశాన్ని ప్రస్తావించి వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా పాటుపడుతున్నారు. కవిత తొలి ప్రసంగం ద్వారా రాష్ట్ర వ్యాప్తం గా వేలాది మంది ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.