ఇందూరు, జూలై 16 : రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బాల అదాలత్ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర కమిషన్ సభ్యురాలు రాగజ్యోతి తెలిపారు. నిజామాబాద్ ప్రగతి భవన్లో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతిభవన్లో బాలఅదాలత్ నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాగ జ్యోతి మాట్లాడుతూ ఈ నెల 23న ప్రగతిభవన్లో ఉదయం 10 నుంచి 4 గంటల వరకు రాష్ట్ర కమిషన్ బెంచ్ ఆధ్వర్యం లో బాలఅదాలత్ను నిర్వహించనున్నట్లు తెలిపా రు. జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన బాలలకు సమస్యలను ఇందులో చర్చించి పరిష్కరిస్తారన్నారు. కొవిడ్తో అనాథలుగా మారిన పిల్లలు, అక్రమ రవాణా, అక్రమ దత్తత, వేధింపులకు గురవుతున్న పిల్లలకు సంబంధించిన విషయాలను బెంచ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చన్నారు.
బాలల హక్కుల ఉల్లంఘన, బడుల్లో వేధింపులు, పాఠశాలల్లో అడ్మిషన్ల నిరాకరణ, వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు, లైంగిక వేధింపులకు గురైన పిల్లలకు పరిహారం, వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యం, యాసిడ్ దాడులకు గురైన పిల్లలు, వదిలేయబడిన, నిరాదరణకు గురైన, హెచ్ఐవీ లాంటి వ్యాధులతో వివక్షకు గురైన పిల్లలు, పోలీసులతో కొట్టించడం లాంటి హక్కుల ఉల్లంఘనకు గురైన వారు ఫిర్యాదు చేయాలని కోరారు. పిల్లలే కాకుండా పిల్లల తరపున తల్లిదండ్రులు, సంరక్షకులు, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అన్ని శాఖల వారు కలిసికట్టుగా పనిచేసి బాల అదాలత్ను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. అనంతరం బాలఅదాలత్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంక్షేమాధికారిణి ఝాన్సీరాణి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, టీఎస్సీపీఎస్ఆర్ సెక్రటరీ రమణాచారి, జిల్లాలోని బీసీ, మైనార్టీ వెల్ఫేర్, లేబర్ డిపార్ట్మెంట్, డీఆర్డీవో, విద్యాశాఖ అధికారులు, సీడీపీవోలు సిబ్బంది పాల్గొన్నారు.