నిజామాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):భారీ వర్ష సూచన నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్ నుంచి సమీక్షించారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పటికీ విరామ సమయంలో ఉభయ జిల్లాల్లో వర్ష పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఫోన్లో నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేశ్ వి పాటిల్తో మాట్లాడారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. భారీ నుంచి అతిభారీ వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లో అత్యవసర సేవలు అందించే శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి వేముల చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పునరావాస చర్యలకు ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకోవాలని పేర్కొన్నారు. గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటుగా భారీ వర్ష సూచనపై హెచ్చరికలు జారీ చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ప్రజలకు అండగా నిలవాలి…
గులాబ్ తుఫాన్తో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉభయ జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేశ్ వి పాటిల్ను ఆదేశించారు. తుపాన్ ప్రభావంతో సోమవారం ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సరిహద్దుల్లోని ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిందని మంత్రి వేముల గుర్తు చేశారు. కొన్ని రోజులుగా జిల్లాలో పలుమార్లు భారీ వానలు కురిసినప్పటికీ జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ప్రమాదాలు వెలుగు చూడలేదని చెప్పా రు. అదే స్ఫూర్తితో పనిచేసి తుపాన్ గండం నుంచి బయ టపడేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపాలిటీ, వ్యవసాయ, ఎలక్ట్రిసిటీతోపాటుగా ఇతర శాఖల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అన్నారు.
ప్రాణ హాని లేకుండా చూడండి..
భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా చూడాలని అధికార యంత్రాంగానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఎక్కడ కూడా ప్రజలకు, మూగజీవాలకు, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో తిరిగి ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ఆది, సోమవారాల్లో కురిసిన వానలతో గోదావరిలోకి ప్రవాహం పెరిగే ఆస్కారం ఉందని మంత్రి తెలిపారు. గోదావరి ప్రవాహానికి తగ్గట్లుగా ఎస్సారెస్పీ అధికారులు చర్యలు తీసుకుంటారని దిగువ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చూడాలని చెప్పారు. ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంత ప్రజలను, నది పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో పునరావాస చర్యలకు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని ఇరు జిల్లాల కలెక్టర్లకు వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.